– అందర్నీ పర్మినెంట్ చేసి గ్రీన్చానల్ ద్వారా జీతాలివ్వాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– మండల, జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ జీపీ సిబ్బంది అరెస్టు
– అయినా వందలాదిగా తరలొచ్చిన కార్మికులు
– పంచాయతీరాజ్ కమిషనరేట్ ఎదుట గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనీ, సిబ్బందినందర్నీ పర్మినెంట్ చేసి గ్రీన్ చానల్ ద్వారా కనీస వేతనాలివ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషన్రేట్ ఎదుట తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో జీపీ వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో గురువారం నుంచే పంచాయతీ కార్మికులు, బిల్కలెక్టర్లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నా…మండల, జిల్లా కేంద్రాల్లో అడ్డుకుని అరెస్టులు చేసినా కార్యక్రమానికి వందలాది మంది తరలొచ్చి ధర్నాను విజయవంతం చేశారు. ధర్నాలో ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ధర్నానుద్దేశించి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా నిత్యం పంచాయితీ కార్మికులు ప్రజలకు సేవలందిస్తున్నా రని గుర్తుచేశారు. అలాంటి కార్మికుల పనిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. పని భద్రత, పర్మినెంట్, కనీస వేతనాల అంశాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికుల మెడకు ఉరితాళ్ళను బిగించిందని విమర్శించారు. తాము అధికారం చేపడితే ఈ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీ లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చి ఇప్పుడు మోసం చేస్తోందన్నారు. గత ప్రభుత్వానికీ, కాంగ్రెస్ సర్కార్కు పెద్ద తేడా లేదని విమర్శించారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలనీ, 60 ఏండ్లు పైబడిన కార్మికులకు రిటైర్డ్ బెనిఫిట్స్ కింద రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.9,500 వేతనంతో ఒక కుటుంబం ఎలా బతుకుతుంది? మంత్రులు ఆ డబ్బులతో ఒక్కరోజైనా జీవించగలుగుతారా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కార్మికుల వేతనాలను పెంచాలని, గ్రీన్ చానల్ ద్వారా చెల్లించి కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని కోరారు.
సమస్యలను పరిష్కరించకుంటే జులై 15 తర్వాత నిరవధిక సమ్మె పంచాయతీ కార్మికులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 52,000 మంది పంచాయితీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదన్నారు. మల్టీపర్పస్ విధానం వచ్చాక నైపుణ్యం లేని పనులు చేయడం వల్ల ట్రాక్టర్, విద్యుత్, తదితర ప్రమాదాల్లో 200 మంది పంచాయతీ కార్మికులు చనిపోయారనీ, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. బాధిత కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం కింద రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ గ్రామ పంచాయితీల్లో ఆన్లైన్లో నమోదు కాకుండా ఇంకా 8,200 మంది కార్మికులున్నారనీ, వారి పేర్లను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి వారికి వేతనాలు చెల్లించాలని కోరారు.
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES