నవతెలంగాణ – అశ్వారావుపేట : మండలంలోని రామన్నగూడెం సమీపంలో అటవీశాఖ ఆధీనంలో ఉన్న టేకు ప్లాంటేషన్ ఎదుట అశ్వారావుపేట – రామన్నగూడెం ప్రధాన రహదారిపై గిరిజనులు శనివారం రాస్తారోకో చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామన్నగూడెం గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ లు 30,36,39 లో గిరిజనులకు ఉన్న పట్టా భూములను తక్షణమే జాయింట్ సర్వే చేసి తిరిగి అప్పగించాలని, అదే విధంగా హైకోర్టు, ఉమ్మడి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న స్థానిక అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు.
దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోగా, వాహనాలు నిలిచిపోయాయి.ఈ సమాచారం అందుకున్న స్థానిక సీఐ నాగరాజు రెడ్డి,అదనపు ఎస్సై రామ్మూర్తి, ట్రైనీ ఎస్సై అఖిల తోపాటు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న గిరిజనులతో చర్చించారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్న ఆధారాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు. దీంతో శాంతించిన గిరిజనులు నిరసనను విరమించారు.