నవతెలంగాణ – హైదరాబాద్ :రాష్ట్రంలోని ఉద్యోగులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ అతి త్వరలోనే నూతన ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తేనున్నట్టుగా తెలిపారు. శనివారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి సారధ్యంలో జేఏసీ నాయకులు రమేష్ పాక, ఎం.రాధ, బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, తదితరులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదరకు లచ్చిరెడ్డి పలు విషయాలను వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి క్యాష్ లెస్ ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని కోరారు. గతంలోనే జేఏసీ పక్షాన ఇదే పథకానికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను తమరికి అందచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరైన ఆరోగ్య పథకం అమల్లో లేదన్నారు. దీంతో ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహశీల్దార్ రాజేష్ ఖన్నా ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయి ఆస్పత్రిలో చేరడంతో అతడి కుటుంబం పడిన ఇబ్బందులను మంత్రికి లచ్చిరెడ్డి వివరించారు. జేఏసీ నాయకులుగా తాము రాజేష్ ఖన్నాకు అందించిన చేయూత గురించి మంత్రికి చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఉద్యోగికి కూడా రాజేష్ ఖన్నా లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తక్షణమే నూతన ఆరోగ్య పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టి అమలు చేయాలని కోరారు.
రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగులకు సరికొత్త విధానంతో ఆరోగ్య పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఏ ఒక ఉద్యోగి బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్నారు. గతంలో జేఏసీ ఏ పథకాన్ని అయితే కావాలని కోరిందో.. అదే త్వరలోనే అందుబాటులోకి రాబోతుందన్నారు.