నవతెలంగాణ – దుబ్బాక : మండలంలోని మారు మూల గ్రామాల్లో విచ్చలవిడిగా చెట్లను నరికేసి, కలపను తరలిస్తూ సొమ్ము చేసుకునే అక్రమ దందా కొనసాగుతోంది. కాలువ, పొలం గట్లపై నాటిన, అడవి ప్రాంతాల్లోని చెట్లను పగలు, సాయంత్రం వేళల్లో నరికేసి, చిన్నపాటి దుంగలుగా కొట్టి సిద్ధం చేస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనాల్లో ఎక్కించి చీకట్లో తరలిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో కలప తరలుతోంది. దుబ్బాక పట్టణ శివార్లలో రహస్య ప్రదేశాల్లో, కొన్ని కట్టెకోత మిషన్ దుకాణాల వద్ద ఈ అక్రమ కలపను పోగు చేసి లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. కొందరు అక్రమార్కులు భూయజమానులతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఇటుక, బొగ్గు బట్టీలకు ఈ కలపను వాడుతున్నారు. అధికారులు ఏనాడూ తనిఖీలు చేయడం లేదు. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
యథేచ్ఛగా అక్రమ కలప రవాణా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES