Sunday, July 13, 2025
E-PAPER
HomeNewsరోడ్డు ప్రమాదాలు చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

రోడ్డు ప్రమాదాలు చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

- Advertisement -

– ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌లో వాహన సామర్థ్యం నిర్ధారణ
– వాహన సారధిలో తెలంగాణ భాగస్వామ్యం :
– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
: నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తే అవసరమైతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసేలా భవిష్యత్‌లో చర్యలు చేపట్టనున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వాహనాల వెనుక వైపు రిఫ్లెక్టర్‌ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునే విధంగా జీవో తీసుకొస్తామని, డ్రైవింగ్‌ శిక్షణ సెంటర్ల ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దండంపల్లి వద్ద రూ.8 కోట్లతో నిర్మించనున్న ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ భవన నిర్మాణానికి శనివారం రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి పొన్నం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, వాహనం ఫిట్నెస్‌ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని తగ్గించేందుకు ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ ఉపయోగపడుతుందని చెప్పారు. మనిషికి జబ్బు చేసినప్పుడు సీటీ స్కాన్‌ తీసిన విధంగానే.. ఈ స్టేషన్లో సాంకేతిక పరికరాల సహాయంతో సుమారు 15 అంశాల్లో వాహనం రోడ్డుపై తిరిగేందుకు పనికొస్తుందా లేదా అన్నది నిర్ధారిస్తుందని తెలిపారు. రవాణా రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 17 ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఇప్పటివరకు రవాణా శాఖ ద్వారా స్క్రాపింగ్‌ పాలసీని తీసుకొచ్చామన్నారు. ఏటీసీ వల్ల ప్రతి వాహనం సారధి పరిధిలోకి వచ్చే విధంగా తెలంగాణను వాహన సారధిలో భాగస్వామ్యం చేశామని తెలిపారు. ట్రాఫిక్‌ అవేర్నెస్‌ క్యాంపుల నిర్వహణ, పాఠశాలల్లో విద్యార్థులకు క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌లను ఆటోమేటిక్‌గా నిర్వహించి పాస్‌ అయితేనే లైసెన్స్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నార్కట్‌పల్లి డిపోకు పూర్వ వైభవం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల 20 నెలల్లో 200 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాకు 70 ఈ బస్సులు ఇవ్వగా, 10 బస్సులు నార్కట్‌పల్లికి, తక్కినవి ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నామన్నారు. నార్కట్‌పల్లికి 80 కొత్త బస్సులు కావాలని, ఈ డిపోకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. వాహనాల ఫిట్నెస్‌ సరిగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లాలో ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ శ్రీవాణి మాట్లాడుతూ.. మ్యాన్యువల్‌గా కాకుండా మిషన్‌ ద్వారా వాహనాలను పరీక్షించే అవకాశం ఏటిసి ద్వారా ఉందని తెలిపారు.
ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభం
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ బస్‌ డిపోకు 40 ఎలక్ట్రికల్‌ బస్సులు రాగా, శనివారం 10 బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వరకు మంత్రి వెంకట్‌రెడ్డి బస్సు నడిపారు. అదేవిధంగా తిప్పర్తి, వేములపల్లి మండలాల్లో అభివృద్ధి పనులకు శంకస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కుందూరు రఘువీర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ నారాయణ అమిత్‌,
రవాణా శాఖ కమిషన్‌ చంద్రశేఖర్‌, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ కె.జాన్‌రెడ్డి, విశ్రాంత ఆర్టీవో మోహన్‌రెడ్డి, ఆర్టీఓ మెంబర్లు రాజిరెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -