Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంచేనేత రంగానికి సర్కార్‌ పెద్దపీట

చేనేత రంగానికి సర్కార్‌ పెద్దపీట

- Advertisement -

– థ్రిఫ్ట్‌ ఫండ్‌తో 36,133 మంది కార్మికులకు లబ్ది
– నేడు హైదరాబాద్‌లోజాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
– 33 మంది నేత కార్మికులకుకొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. వారికి ఆర్థికంగా చేయూతనందించేందుకు అన్ని శాఖలు, కార్పొరేషన్లు, సంస్థల ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2025-26లో ఇప్పటివరకు రూ.587.26 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చింది. ఇందిరా మహిళ శక్తి స్వయం సహాయక బృందాలకు చెందిన 65 లక్షల మంది మహిళలకు ఏడాదికి రెండు సార్లు ఉచితంగా చీరలు పంపిణీ చేసేందుకు 131 మ్యాక్స్‌, 56 చిన్నతరహా పరిశ్రమల్లో చీరలు తయారు చేయిస్తున్నారు. రూ.50 కోట్ల కార్పస్‌ ఫండ్‌తో గతేడాది తెలంగాణ చేనేత కార్మిక సహకార సంఘం (టీజీఎస్‌సీవో) నోడల్‌ ఏజెన్సీగా వేములవాడలో యార్న్‌ డిపోను ఏర్పాటు చేసింది. కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని హైదరాబాద్‌లో నెలకొల్పింది. రూ.33 కోట్లతో ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. తెలంగాణ చేనేత అభయహస్తం (థ్రిఫ్ట్‌ ఫండ్‌)లో భాగంగా కార్మికులు తమ జీతం నుంచి రూ.8 పొదుపు చేస్తే, ప్రభుత్వం వారి జీతానికి డబుల్‌ మద్దతుగా ఇస్తుంది. ఈ పథకంతో 36,133 మంది చేనేత కార్మికులు 15 వేల మంది పవర్‌లూమ్‌ కార్మికులు లబ్ది పొందుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఇందుకోసం రూ.30 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ నేతన్న భద్రత పథకం కింద చనిపోయిన చేనేత, అనుబంధ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నది. కార్మికులకు ప్రోత్సాహకంగా సంవ్సతరానికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు అందిస్తుంది. ఈ ఏడాది రూ.12.20 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 33 మంది నేత కార్మికులకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో నిర్వహించే వేడుకల్లో వీటిని ప్రదానం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయే ఈ కార్యక్రమాన్ని చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్‌ పాల్గొంటారు.
అవార్డుకు ఎంపికైన వారు….
కరీంనగర్‌ తుమ్మ రామస్వామి, గుర్రం కొండయ్య, మంచిర్యాల లిక్కి శంకరయ్య, వరంగల్‌ కంచె నర్సింగరావు, జనగాం న్యాలపల్లి విజయ ప్రకాశ్‌, రాజన్న సిరిసిల్ల ఎల్దీ రేఖ, రంగారెడ్డి గంజం శ్రీనివాస్‌, గుర్రం చంద్రమౌళి, హైదరాబాద్‌ కర్దాసు రమేశ్‌, సిద్దిపేట జిందం రాజేశం, బైరి శ్రీనివాస్‌, మంతూరి వెంకటేశం, యాదాద్రి భువనగిరి గూడ పవన్‌. కొలను శంకర్‌, సామల భాస్కర్‌, మంగళపల్లి శ్రీహరి, చెలిమల కృష్ణ, నల్లగొండ కర్నాటి సదుర్గు, చిలుకూరి శ్రీనివాసులు, చిట్టిపోలు ధనుంజయ, గాజుల అనిల్‌, గుర్రం యాదయ్య, మునగపాటి శ్రీనివాస్‌, కర్నాటి కృష్ణయ్య, అవరి రవీంద్ర, నారాయణపేట జన్ను ఆంజనేయులు, యాంగల్‌ ఆంజనేయులు, జోగులాంబ గద్వాల్‌ సూర్య వెంకటేష్‌, లక్ష్మీ, వనపర్తి దేవరకొండ సీతన్న, శీల బుడ్డన్న, మహంకాళి సులోచన, సారంగి రాములు అవార్డుకు ఎంపికయ్యారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img