ఇంజనీరింగ్ కళాశాల రావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..
వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తామని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు పేర్కొన్నారు. బుదవారం యూనివర్సిటీ లో విద్యార్థులు, తల్లిదండ్రులు అధ్యాపకుల పరిచయ కార్యక్రమానికి ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి అధ్యక్షత వహించగా వైస్- చాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ టి యాదగిరిరావు మాట్లాడుతూ ..తెలంగాణ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కళాశాల సుదీర్ఘ స్వప్నమని పేర్కొన్నారు.
ఈ స్వప్నాన్ని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, విద్యావంతుల, మీడియా మిత్రుల కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జీవో నెంబర్ 32 ద్వారా తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల కల నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంజనీరింగ్ కళాశాల మంజూరు గురించి పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయానని ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతించారని పేర్కొన్నారు.ఈ విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ లో జాయిన్ అయినా విద్యార్థులకు అడ్వాన్సడ్ సాంకేతిక పరమైన బోధనా పద్ధతులతో నాణ్యమైన, నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచే విద్యను అందిస్తామని ప్రభుత్వ నిబంధనల మేరకు అందరికీ హాస్టల్ వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ప్రతిష్టాత్మక మైన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన ఈ ప్రాంత శాసనమండలి సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు షబ్బీర్ మహమ్మద్ షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో సాంకేతికంగా సహకరించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి కృషిని ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ నందిని, ప్రొఫెసర్ అతిక్ సుల్తాన్ గోరి, ప్రొఫెసర్ భ్రమరాంబిక, ప్రొఫెసర్ నీలిమ,విద్యార్థులు, తల్లిదండ్రులు టీచింగ్,నాన్ -టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.