నవతెలంగాణ – కాటారం
సమాజంలో అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి ఐలమ్మ స్ఫూర్తిదాయక జీవితం నేటి తరాలకు మార్గదర్శకమని బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు రామిళ్ళ కిరణ్ పేర్కొన్నారు. ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రామిళ్ళ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజక సంఘం ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రామిళ్ళ కిరణ్ మాట్లాడుతూ ఐలమ్మ సామాజిక సమానత్వం కోసం, అణచివేతకు వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేసారని అన్నారు. ఐలమ్మ పోరాటం కేవలం ఒక వర్గానికే కాకుండా మొత్తం సమాజానికి స్ఫూర్తిదాయకమని, నేటి యువత ఐలమ్మ ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకొని సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు రామిళ్ళ కిరణ్,రజక సంఘం అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.