మండల విద్యాధికారికి ఫిర్యాదు..
నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాల నుండి ప్రధానోపాధ్యాయులు రఘునందన్ విద్యార్థులు కూర్చునే బేంచీలు అనుమతులు లేకుండా తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకునేసరికి ఇద్దరు కూలీలు, విద్యార్థులతో కలిసి డీసీఏంలోకి లోడ్ చేస్తుండగా అడ్డుకున్నారు. వెంటనే మండల విద్యాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించగా పాఠశాలకు చేరుకున్న మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అనుమతులు లేకుండా బేంచీలు ఎందుకు తరలిస్తున్నారని ప్రధానోపాధ్యాయునికి వివరణ కోరగా.. జిల్లా విద్యాధికారి అనుమతులతో తరలిస్తున్నామని తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాల నుండి ఏవైనా వస్తువులు తరలించే ముందు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యుల అనుమతితో తీర్మానం చేసి మండల విద్యాధికారి అనుమతులు తీసుకొని తరలించాల్సి ఉంటుందని అధికారులకు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులకు తెలియజేయకుండా ఎలా తరలిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు రఘునందన్ ను నిలదీశారు. బేంచీలు తరలించేందుకు వీలులేదని ఇక్కడ నాలుగు పోస్టులు ఖాళీలు ఉండగా పోస్టులు భర్తీ చేయడానికి జిల్లా అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోకుండా గుట్టు చప్పుడు కాకుండా అనుమతులు లేకుండా బేంచీలు తరలించడం ఎంతవరకు సమంజసంమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా విద్యాధికారికి జిల్లా కలెక్టర్ కు ప్రధానోపాధ్యాయులు రఘునందన్ పై ఫిర్యాదు చేయనున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.
ఈ విషయంపై మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా ప్రధాన ఉపాధ్యాయులు రఘునందన్ బెంచీలు తరలించే ముందు తమ అనుమతులు తీసుకోలేదని ఈ విషయంపై లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయునికి కోరడం జరిగిందన్నారు.