– పవన్ కళ్యాణ్
‘నా వీరాభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ‘ఓజీ’ అలా ఉంటుంది’ అని కథానాయకుడు పవన్కళ్యాణ్ అన్నారు. సుజీత్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా నటించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లోని ఎల్.బి. స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్ర బందంతో పాటు, సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.
సంగీత దర్శకుడు తమన్, తన బృందంతో కలిసి అద్భుతమైన సంగీత ప్రదర్శనతో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సినిమాలో తాను ఆలపించిన ‘వాషి యో వాషి’ గీతాన్ని పవన్ కళ్యాణ్ లైవ్లో వేదికపై పాడటం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల కోసం ప్రత్యేకంగా ‘ఓజీ’ ట్రైలర్ను ప్రదర్శించారు. దీంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయింది.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,’సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్స్తో నేనెప్పుడూ ఇలాంటి వేడుకలకు హాజరుకాలేదు. దర్శకుడు సుజీత్ వల్ల మొదటిసారి ఇలా సినిమా కాస్ట్యూమ్స్తో వచ్చాను. ఇదంతా అభిమానుల కోసమే. ‘వాషి యో వాషి’ అనేది జపనీస్ హైకూ(పద్యం). ‘నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావు. నిన్ను నేలకు దించుతాను’ అని విలన్కి హీరో తెలియజేసే సందర్భంలో ఈ హైకూ వస్తుంది. ఓజీతో పెట్టుకుంటే మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ పాట ద్వారా చెప్పడం జరిగింది. ఇమ్రాన్ హష్మీతో కలసి నటించడం సంతోషంగా ఉంది. ‘జలక్ తిక లాజ’ అంటూ అప్పట్లో ఉర్రుతలూగించారు. ఆయన అద్భుతమైన నటుడు. సుజీత్ నా వీరాభిమాని. ‘జానీ’ సినిమా సమయంలో చాలా రోజులు హెడ్ బ్యాండ్ కట్టుకొని తిరిగానని నాతో చెప్పాడు. సినిమా మీద పిచ్చితో ఇక్కడిదాకా వచ్చాడు. ‘సాహో’ సినిమా తీసిన తర్వాత దర్శకుడు సుజీత్తో మీరు సినిమా చేస్తే బాగుంటుందని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు. నిర్మాత దానయ్య ద్వారా నాకు పరిచయం చేశారు. సుజీత్ కథని చాలా సింపుల్గా చెప్తాడు. కానీ, సినిమా తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది. నేను కాకుండా ఈ సినిమాకి ఇద్దరు స్టార్లు ఉన్నారు.
మొదటి స్టార్ దర్శకుడు సుజీత్. రెండో స్టార్ సంగీత దర్శకుడు తమన్. వీళ్ళిద్దరూ ఈ సినిమా కోసం పిచ్చిగా పనిచేశారు. ఈ సినిమా కోసం వీళ్ళు ఒక మాయలోకి వెళ్ళిపోయి, ఆ మాయలోకి నన్ను కూడా తీసుకెళ్లారు. ఈ సినిమాలోని ప్రతి అంశం మిమ్మల్ని రంజింపజేసేలా ఉంటుంది. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో 80ల నాటి హీరోయిన్లా కనిపిస్తారు. సినిమాలో మా ఇద్దరి మధ్య అనుబంధం తక్కువ నిడివే ఉన్నప్పటికీ, చాలా హద్యంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుండు అనిపిస్తుంది. తక్కువ నిడివిలో అంత చక్కటి ప్రేమకథను చూపించాడు సుజీత్. వెండితెరపై కవిత్వం రాసినంత అందంగా రవి చంద్రన్ విజువల్స్ ఉంటాయి. ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురుచూస్తున్నారు. నేను ‘ఖుషి’ అప్పుడు చూశాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. సినిమాలు వదిలేసి నేను పాలిటిక్స్లోకి వెళ్ళిపోయినా, మీరు నన్ను వదల్లేదు అనిపిస్తుంది. మీరే నాకు భవిష్యత్ ఇచ్చింది. మీరిచ్చిన బలంతోనే ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నాను.
సుజీత్ డైరెక్షన్ టీమ్కి నా ప్రత్యేక అభినందనలు. నేను డైరెక్షన్ చేసే సమయంలో ఇలాంటి టీమ్ ఉండుంటే.. నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కాదేమో. తమన్ టీం కూడా అద్భుతంగా పని చేసింది. ఇందులో ర్యాప్ పాడింది మన తెలుగువాళ్లే. శ్రియా రెడ్డి అద్భుతమైన నటి. కరెక్ట్గా చెప్పాలంటే సివంగి. భవిష్యత్లో ఆమెతో కలిసి పని చేస్తానని మాట ఇస్తున్నా’ అని అన్నారు.
‘ఈ సినిమాని దర్శకుడు సుజీత్ మామూలుగా తీయలేదు. మనందరం పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించబోతున్నాడు. ఈ సినిమా కోసం రెండేళ్లుగా ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని సంగీత దర్శకుడు తమన్ చెప్పారు. ‘ఇంత పెద్ద క్రౌడ్ని, ఇంత ఎనర్జీ నేనెప్పుడూ చూడలేదు. మీ అందరినీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఈ సినిమా ఉంటుంది’ అని కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ తెలిపారు. ”ఓజీ’ తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది. పవన్కళ్యాణ్ని మీరు ఎలా చూడాలనుకున్నారో అలా చూడబోతున్నారు’ అని దర్శకుడు సుజీత్ చెప్పారు. ఈ వేడుకలో నటీనటులు శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్దాస్, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్రాజు, వై.రవిశంకర్, కోనవెంకట్ తదితరులు పాల్గొని ‘ఓజీ’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ జోష్ అప్పుడు ‘ఖుషి’, ఇప్పుడు ‘ఓజీ’కి చూస్తున్నా..
- Advertisement -
- Advertisement -