Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంతల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లల్ని వెళ్లగొట్టొచ్చు

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లల్ని వెళ్లగొట్టొచ్చు

- Advertisement -

సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులపై జరుగుతున్న అరాచకాలెన్నో ఉన్నాయి. రోడ్డున పడ్డ తల్లిదండ్రుల గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుప్రీం కోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే సంతానాన్ని బయటకు వెళ్లగొట్టొచ్చని తేల్చిచెప్పింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం’ అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 80 ఏండ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ తీర్పు వెలువడింది. 2023లో ఈ వృద్ధ జంట కుమారుడి నుంచి పోషణ ఖర్చులు, అలాగే తమ ఆస్తులు తమకు చెందేలా చూడాలని కోరుతూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన ట్రిబ్యునల్‌.. నెలకు రూ.3000 ఇవ్వాలని, అలాగే ముంబయిలోని వారి ఇంటిని ఖాళీ చేయాలని తీర్పునిచ్చింది. అయితే ముంబయి హైకోర్టు ఆ తీర్పును తోసిపుచ్చింది. 2007 చట్టం ప్రకారం ఆ కుమారుడు కూడా సీనియర్‌ సిటిజన్‌ కావడంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టేలా ఆదేశాలు ఇచ్చే న్యాయపరిధి దానికి లేదని పేర్కొంది.

అయితే హైకోర్టు పరిగణనలోకి తీసుకున్న కారణం తప్పని సుప్రీం అభిప్రాయం వ్యక్తంచేసింది. ట్రైబ్యునల్‌ తీర్పును సమర్థించింది. నవంబర్‌ 30లోగా ఆ కుమారుడు ఇంటిని ఖాళీ చేయాలని గడువు ఇచ్చింది. గతంలోనూ కోర్టు ఈ తరహా తీర్పునిచ్చింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కులేదని తేల్చి చెప్పింది. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీనిచ్చి, వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన తల్లిదండ్రులు సుప్రీంను ఆశ్రయించారు. ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దుచేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది. తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టం ప్రకారం.. ఏర్పాటైన ట్రిబ్యునళ్లు… కన్నవారిని పట్టించుకోని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రిబ్యునళ్లకు ఉంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -