దేశ రక్షణ వ్యవస్థకు కీలకంగా మారనున్న కొత్త ఆవిష్కరణలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మరో భారీ ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో టీ-వర్క్స్ వేదికగా యుద్ధ విమానాల ఫ్లైట్ సిమ్యులేటర్ రూపుదిద్దుకుంటోంది. ఎయిర్ ఫోర్స్, నేవీ యుద్ధ విమానాల పైలట్ల శిక్షణ కోసం అవసరమయ్యే సిమ్యులేటర్లను ఇప్పటి దాకా భారీ వ్యయంతో అమెరికా, యూరప్ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా ఇకపై ఆ అవసరం ఉండదు. మనమే అగ్రదేశాలకు ఎగుమతి చేయగలిగే స్థాయికి చేరుకోనున్నాం. ఎయిర్ ఫోర్స్లో పైలట్లుగా ఎంపికైన అభ్యర్థులకు మొదట ఫ్లైట్ సిమ్యులేటర్లలో శిక్షణ ఇస్తారు. విమానం ఎగిరే కృత్రిమ వాతావరణాన్ని సృష్టించే సిమ్యులేటర్లు ఎయిర్ క్రాఫ్ట్ను గాలిలో నడిపిన అనుభూతినిస్తాయి. కాక్ పిట్లో కూర్చుని బయటి నుంచి శిక్షకులు ఇచ్చే సూచనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యవస్థను నియంత్రించాల్సి ఉంటుంది. విమానం టేకాఫ్, ల్యాండింగ్, తలకిందులుగా ఎగరడం లాంటి అన్ని రకాల విన్యాసాల శిక్షణ సిమ్యులేటర్ ద్వారా లభిస్తుంది. యుద్ద విమానాల్లో ఉండే, ఎలక్ట్రానిక్, ఆటోమేటిక్ నియంత్రణ వ్యవస్థలన్నీ ఇందులో ఉంటాయి.
ఎదురుగా అర్ద చంద్రాకారంలో ఉండే స్క్రీన్ పైన ఫైటర్ జెట్ కదులుతున్న దృశ్యాలు ఆవిస్కతమవుతుంటాయి. యాక్సియల్ ఏరో సంస్థ ఈ సిమ్యులేటర్ల తయారీకి అన్ని అనుమతులు సాధించి వాణిజ్య ఉత్పత్తి మొదలు పెట్టింది. వచ్చే మూడేండ్లలో ఐదు సిమ్యులేటర్లను సరఫరా చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నెలకొల్పిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్ లెన్స్తో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్ దిగుమతి చేసుకుంటున్న ఒక్కో ఫైటర్ జెట్ సిమ్యులేటర్ వ్యయం రూ.50 కోట్ల వరకు ఉండగా, యాక్సియల్ ఏరో రూ.25-30 కోట్లకే అందజేయనుంది. టీ-వర్క్స్లో పరిశోధనలు సాగిస్తున్న ఈ సంస్థ ఎయిర్ ఫోర్స్, నేవీ అవసరాలకు తగిన విధంగా ఫ్లైట్ సిమ్యులేటర్లను తయారు చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. టీ-వర్క్స్ను సందర్శించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశోధనల పురోగతిని పరిశీలించి, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. తక్కువ సమయంలో క్లిష్టమైన పరిశోధనలను పూర్తి చేసి ఆర్డర్లు సాధించినందుకు ప్రత్యకంగా ప్రశంసించారు.
ఫైటర్ జెట్ ‘సిమ్యులేటర్ల’ తయారీలో హైదరాబాద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES