నేటిలోగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయాలి : అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-1 అభ్యర్థులకు శనివారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలను అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రూప్-1 ఫలితాల ను టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. 563 పోస్టులకుగాను 562 మంది అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పోస్టుల కు ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామకపత్రాలను అందిస్తామని తెలిపారు. దాదాపు 18 శాఖలకు చెందిన అభ్యర్థులు ఎంపికయ్యారని వివరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం శుక్రవారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఒక్కొక్క అభ్యర్థికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నియామకాల్లో అత్యధికంగా రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారే ఉన్నారని వివరించారు. రెవెన్యూ, హోం, జీఏడీ కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 ఏండ్ల పాటు సర్వీస్లో ఉంటారనీ, వారికి హార్థిక ఉత్తేజకరమైన వాతావరణంలో నియామక పత్రాలు అందచేయాలని వివరించారు. ప్రభుత్వ సర్వీస్ పట్ల వారికి ఉన్నత భావన కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సబ్యసాచి ఘోష్, వికాస్ రాజ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ జితేందర్, ముఖ్య కార్యదర్శులు బెనహర్ మహేష్ దత్ ఎక్కా, సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు లోకేష్ కుమార్, టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
సీఎం చేతుల మీదుగా గ్రూప్-1 అభ్యర్థులకు రేపు నియామకపత్రాలు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES