పదవి కాపాడుకోవడానికే కర్నాటక కాంగ్రెస్ కుట్రలపై మౌనం
రేవంత్రెడ్డి నల్లమల్ల పులి కాదు..పిల్లి
కాంగ్రెస్, బీజేపీది తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం
స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొందపెట్టాలి : అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరును ఎడారిగా మార్చే కర్నాటక కాంగ్రెస్ కుట్రలను అడ్డుకోకుండా నల్లమల్ల పులి అని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. పిల్లిలాగా ఇంట్లో కూర్చున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. రూ.70వేల కోట్లతో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును మరో ఐదు మీటర్లు పెంచే కర్నాటక కుట్ర ఫలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చుక్క కృష్ణా నీరు కూడా రాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి నిర్మాణాన్నే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన ‘బీఆర్ఎస్ జన గర్జన’ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఆల్మట్టి ఎత్తు పెరిగితే కొడంగల్ లిఫ్ట్, పాలమూరు ఎత్తిపోతలు, శ్రీశైలం డ్యామ్ నిరుపయోగంగా మారతాయన్నారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్రలపై ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఇక్కడ రేవంత్రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
సీఎం పదవి కాపాడుకునేందుకే రేవంత్ మౌనంగా ఉన్నారని చెప్పారు. ఏ రోజుకైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే కర్నాటక ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీతో మాట్లాడించి, ఆల్మట్టి ఎత్తు పెంపును ఆపించాలని సవాల్ విసిరారు. లేదంటే గులాబీ దండే స్వయంగా వెళ్లి అడ్డుకుంటుందని హెచ్చరించారు. కేసీఆర్కు పేరు వస్తుందన్న అక్కసుతో బీఆర్ఎస్ హయాంలో 90శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పక్కనపెట్టిందని విమర్శించారు. ఆ ప్రాజెక్టుతో ఏ సంబంధం లేని జైపాల్రెడ్డి పేరు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 70వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.1350 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేశామని, అచ్చంపేట బిడ్డ అని చెప్పుకునే రేవంత్రెడ్డి ఆ పథకాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టారని ఆరోపించారు.
స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొంద పెట్టాలి
ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి వర్గాన్ని దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభిం చామని అన్నారు. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలని, ఇదే ప్రజల చేతుల్లోని బ్రహ్మాస్త్రమని తెలిపారు. రియల్ ఎస్టేట్ దందాలతో వందల కోట్లు సంపాదిస్తున్న కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ.5వేలు ఇచ్చినా, బాకీ డబ్బులు ఎప్పుడు ఇస్తారని నిలదీయాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు డబ్బులిచ్చి ప్రమాణాలు చేయించినా, ఉత్తుత్తి ప్రమాణాలు చేసి కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ ప్రకటించకుండా రేవంత్రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వమని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 27న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ దాడుల్లో నోట్ల కట్టలు దొరికాయని ప్రచారం చేశారని, కానీ ఆయన కాంగ్రెస్లో చేరి, ఏడాది గడిచినా ఈడీ నోరు మెదపడం లేదని, ఇదే వారి అవగాహనకు నిదర్శనమన్నారు. ఈ రెండు పార్టీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడటం దారుణమన్నారు. అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.