Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలకు లోబడి విధులు నిర్వహించాలి: కలెక్టర్

అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలకు లోబడి విధులు నిర్వహించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలకు లోబడి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చెప్పారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తు.చా తప్పకుండా పాటించాలని అన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, గ్రౌండింగ్ వంటివి చేయకూడదని తెలిపారు. అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులతో ఎలాంటి సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు నిర్వహించకూడదని, వారితో సమావేశాలలో పాల్గొనకూడదని చెప్పారు. ఇది వరకే ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు, అమలవుతున్న పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా అంతటా గ్రామపంచాయతీ, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు.

ప్రత్యేకించి ముఖ్యమైన తాగునీరు, వైద్యం ,తదితర అత్యవసర పనులు కొనసాగుతాయని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలు, ఎంపిటిసి ,జడ్పిటిసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయి వరకు అధికారులు అందరూ సిబ్బంది ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తిగా స్పష్టత కలిగి ఉండాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున జిల్లా వ్యాప్తంగా ఎక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన ,ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగులు, కటౌట్లు ,పోస్టర్లు, బ్యానర్లు ఉండకూడదని స్పష్టం చేశారు.

గ్రామపంచాయతీ ,ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా వచ్చే సోమ వారం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని, అప్పటివరకు ప్రజావాణి కార్యక్రమం జరగదని, అందువలన జిల్లా ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, వినతులను సమర్పించేందుకు సోమవారం జిల్లా కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.పీ డీ హౌసింగ్ సిదార్ధ ,సిపిఓ కిషన్, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, డి సి ఓ పద్మ, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్, నరసింహారావు , సూపర్టీడెంట్లు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -