ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ఈ నెల నాలుగుకు వాయిదా పడింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో ట్రిబ్యునల్ పదవ షెడ్యూల్ కింద రెండో రోజు విచారణ కొనసాగించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు వారి న్యాయవాదులు, వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు. సోమవారం ఎమ్మెల్యేల తరుఫు న్యాయవాదులు పిటీషనర్ల తరుఫు న్యాయవాదులను క్రాస్ ఎగ్జామిన్ చేయగా, బుధవారం జరిగిన విచారణలో పిటీషనర్ల తరుఫు న్యాయవాదులు ఎమ్మల్యేల తరుఫు న్యాయవాదులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. మొదట రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ న్యాయవాదులు ఆయనపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ న్యాయవాదుల మధ్య విచారణ కొనసాగింది. ఆ తర్వాత చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య న్యాయవాదులు ఆయనపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ న్యాయవాదుల మద్య వాదనలు జరిగాయి.
ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి న్యాయవాదులకు స్పీకర్ గంట చొప్పున సమయాన్ని కేటాయించారు. పార్టీ మారిన అనేక అంశాలపై వాదనలు జరిగినట్టుగా తెలిసింది. క్రాస్ ఎగ్జామినేషన్లో పిటిషనర్ల అడ్వకేట్లు అనేక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వారి నుంచి వివరాలు రాబట్టుకునేందుకు తమ దగ్గరున్న సాక్ష్యాలతో వాదనలు వినిపించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో సమయం సరిపోకపోవడంతో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిల విచారణను ఈ నెల 4కు స్పీకర్వాయిదా వేశారు. కాగా ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారి తరపున న్యాయవాదులు మాత్రమే హాజరయ్యారు. విచారణ కొనసాగుతున్నందున అక్టోబర్ 6వ తేదీ వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధిస్తూ స్పీకర్ కార్యాలయం ఇటీవలనే బులెటిన్ను విడుదల చేసింది. ఈ క్రమంలో బుధవారం సైతం అసెంబ్లీ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ 4కు వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES