నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ “మానసిక ఆరోగ్యం” పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 4 నుండి 12 వరకు “మానసిక ఆరోగ్యం- శ్రేయస్సు” పై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ వారు నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం లోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు ఎదో రకంగా మానసికంగా బాధపడుతున్నారని,మరికొందరు మానసిక వత్తిడికి లోనవుతున్నారన్నారు. అయినప్పటికీ మనం ఈ సమస్యను పక్కన పెడుతున్నామని, మానసిక వత్తిడి తగ్గాలంటే జీవన విధానం మార్చుకోవాలని ,స్మార్ట్ ఫోన్ ను సాధ్యమైనంతగా తగ్గించాలని, ప్రత్యేకించి పాఠశాల, కళాశాల విద్యార్థులు స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టాలన్నారు. పెద్దలు సైతం రాత్రి సమయాలలో వత్తిడి లేకుండా ఉన్నప్పుడే మంచి నిద్రతో పాటు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
మానసిక ఆరోగ్యం పై లయన్స్ క్లబ్ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన సరిపోదని ,మానసిక ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యమని, దీనికై ఉదయపు నడక, ప్రశాంతత, ఒత్తిడికి లోను కాకుండా ఉండడమే ముఖ్యమని అన్నారు. ఇటీవల కాలంలో చిన్న వయసు వారు సైతం గుండెజబ్బులతో చనిపోతున్న విషయాన్ని మనం గమనిస్తున్నామని, మనిషి అనేక రకాల ఒత్తిళ్లకు గురి కావడం జరుగుతున్నదని, ఈ వత్తిడికి అన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకోవాలని, మెదడుకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని,ఇందుకు గాను తప్పనిసరిగా ఒత్తిడి కల్పించని అంశాలను చదవాలని చెప్పారు.
పోటీ పరీక్షలు,ఇతర అంశాలలో పేద పిల్లలకు సహాయం చేసేందుకు నల్లగొండ లో ఒక టౌన్ హాల్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఈ విషయంలో లయన్స్ క్లబ్ సహకరించాలని కోరారు. లయన్స్ క్లబ్ లాగా అందరూ ముందుకు వచ్చి సామాజిక సేవా పద్ధతిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ మదన్ మోహన్, నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.