Wednesday, July 1, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రజల నమ్మకమే బ్యాంక్ అభివృద్ధికి మూలస్తంభం

ప్రజల నమ్మకమే బ్యాంక్ అభివృద్ధికి మూలస్తంభం

- Advertisement -

– తెలంగాణలోనే నెం.1 కో-ఆపరేటివ్ బ్యాంక్‌గా గాయత్రి బ్యాంక్
– రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– కమ్మర్‌పల్లిలో గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ 85వ శాఖ ప్రారంభం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ప్రజల నమ్మకమే బ్యాంక్ అభివృద్ధికి మూల స్తంభమని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.తెలంగాణలోనే నెం.1 కో-ఆపరేటివ్ బ్యాంక్‌గా నిలిచిన గాయత్రి బ్యాంక్, దేశంలోని 4500 బ్యాంకుల్లో 32వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు.పారదర్శకత, నిజాయితీతో కూడిన సేవలే లక్ష్యంగా సాగాలన్నారు.కమ్మర్‌పల్లి మట్టి బిడ్డ కొత్తూర్ లక్ష్మారెడ్డి సారథ్యంలో గాయత్రి బ్యాంక్ ప్రగతి పథంలో ముందుకెళ్తుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటే కృషి జరగాలని గాయత్రి బ్యాంక్ సిబ్బందికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ 85వ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి బ్యాంక్ శాఖను ప్రారంభించారు. బ్యాంక్ యాజమాన్యానికి, సిబ్బందికి, కమ్మర్‌పల్లి మండల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ సాధించిన ప్రగతిని అభినందించారు. 2000 సంవత్సరంలో జగిత్యాలలో తన మొదటి శాఖతో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ బ్యాంక్, నేడు 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రజాదరణ పొందుతూ 85 శాఖలకు విస్తరించడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు.దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 4,500 ప్రైవేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులలో గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ 32వ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని కో-ఆపరేటివ్ బ్యాంకుల్లోనే నంబర్ వన్ స్థానంలో నిలిచి అగ్రగామిగా సేవలందిస్తోందని ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు. మండలంలోని హస కొత్తూర్ గ్రామానికి చెందిన మన ప్రాంత వాస్తవ్యుడు కొత్తూర్ లక్ష్మారెడ్డి ఈ బ్యాంక్ చైర్మన్‌గా వ్యవహరించడం మనందరికీ ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం లక్ష్మారెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ, వారి నిరంతర కృషి, నిబద్ధత, నిజాయితీ వల్లే బ్యాంక్ ఇంతటి ఉన్నత స్థాయికి చేరిందని కొనియాడారు. బ్యాంక్ సిబ్బంది శ్రమ, లక్ష్మారెడ్డి సమర్థవంతమైన నాయకత్వం వెరసి ఈ విజయానికి కారణమని ఆయన ప్రశంసించారు.

ఏదైనా ఒక బ్యాంకింగ్ సంస్థ వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో నమ్మకాన్ని చూరగొనడమే అత్యంత ముఖ్యమని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గాయత్రి బ్యాంక్ యాజమాన్యం, సిబ్బంది రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు మరింత పారదర్శకంగా, నిజాయితీగా సేవలను అందించాలని ఆయన సూచించారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, స్థానికుడిగా గాయత్రి బ్యాంక్ సాధిస్తున్న విజయాల పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని, కమ్మర్‌పల్లి ప్రాంత ప్రజలు ఈ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, బ్యాంక్ ఉన్నతాధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -