ఐక్యతకు చిహ్నంగా వేడుకలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దసరా వేడుకల సందర్భంగా సీకా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో లండన్లో రెండో సంవత్సరం అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి. కుల, మత, రాజకీయ, రాష్ట్ర భేదాలను అధిగమించి అన్ని తరగతుల తెలుగు ప్రజలు ఒకే వేదికపై కలుసుకున్నారు. ప్రవాస జీవితంలో చాలామంది ఎన్ఆర్ఐలు వత్తి, రాజకీయాలు, సామాజిక వర్గాల కారణంగా విడిపోయిన నేపథ్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఒక్కతాటిపైకి తెచ్చే వేదికగా నిలిచింది. తెలంగాణ సంప్రదాయ వంటకాలు, ముఖ్యంగా పిండివంటలు, ప్రత్యేకంగా భారతదేశం నుంచి తెప్పించి అందరికీ రుచిచూసేలా చేశారు. గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాల నేపథ్యంలో ఈ వేడుకలను ఉత్సాహంగా లండన్లో నిర్వహించారు.
స్థానిక మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ ముఖ్య అతిథిగా హాజరై ”సాంస్కృతిక ఐక్యత కోసం చేసిన ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ వంటి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్గొని, రాజకీయాలకు అతీతంగా చేపట్టారు. కొంతమంది ”ఇరవై ఏండ్ల తర్వాత మేము పాత స్నేహితులను కలుసుకున్నాం. వత్తి, జీవన శైలి కారణంగా దూరమైన స్నేహాలు మళ్లీ పునరుజ్జీవించాయని’ భావోద్వేగంతో అన్నారు. వందలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొని , వంటకాలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందంగా గడిపారు.