మహబూబాబాద్ జిల్లా మండలకేంద్రం గూడూరులోని పాకాలవాగు ఒడ్డున అరుదైన కాకతీయానంతర శైలి శిల్పాన్ని తెలంగాణ వారసత్వశాఖ అధికారి మల్లునాయక్ గుర్తించారు.
సమపాద స్థానకభంగిమలో పద్మపీఠంపైన నిలబడివున్న ఈ మూర్తి ద్విభుజుడు. కుడిచేతిలో జలపాత్ర, ఎడమచేతిలో శంఖం ధరించి వున్నాడు. మెడలో హార, గ్రైవేయకాలున్నాయి. దండరెట్టలమీద, ముంజేతులకు కంకణాదులున్నాయి. కాళ్ళకు కడియాలు, పాంజీబులున్నాయి. కౌపీనం ధరించివున్నాడు. పరివారంగా చక్రపురుషుడు, గదాదేవి ఉన్నారు.
ప్రతిమా లక్షణాలనుబట్టి ఈ మూర్తి ధన్వంతరి. ఈ శిల్పం నిరాలంబంగా ఉంది. ధన్వంతరి శిల్పాలు సర్వాభరణాలంకతమై కనిపిస్తాయి. ఈ విగ్రహం సాదాగా కనిపిస్తున్నది. శైలిని బట్టి ఈ శిల్పం కాకతీయానంతరశైలికి చెందినదని కొత్త తెలంగాణ చరిత్రబందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.
ఈ శిల్పాన్ని పాకాలవాగు ఒడ్డున నుంచి వరంగల్ పురావస్తు ప్రదర్శనశాలకు తరలించి, భద్రపరచాలని కొత్త తెలంగాణ చరిత్ర బందం తెలంగాణ వారసత్వశాఖను కోరుతున్నది.
ఈ మూర్తి ప్రతిమాలక్షణాలను గుర్తించడంలో సుపర్ణమహి (టి.మహేశ్, అద్దంకి) సహకరించాడు.
ఫొటోగ్రఫీ: మల్లునాయక్, తెలంగాణ వారసత్వశాఖ, హైద్రాబాద్
శిల్ప వివరణ: శ్రీరామోజుహరగోపాల్, 9949498698
అరుదైన ధన్వంతరి శిల్పం
- Advertisement -
- Advertisement -