Thursday, April 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెద్దల చదువుకు పెద్ద పీట

పెద్దల చదువుకు పెద్ద పీట

- Advertisement -

వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగంలో వేగంగా సంస్కరణలు
తెలంగాణ దూకుడు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మారుతున్న కాలానికి తగినట్టు మారితేనే మనుగడ సాధ్యమవుతుంది. ఈ క్రమంలోనే విద్యా రంగంలోనూ పలు సంస్కరణలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యా శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పిల్లలంతా బడుల్లో ఉండడమే కాదు. పెద్దలు సైతం అక్షరాలు నేర్చుకోవాలనీ, ఆధునిక కాలపు అవసరాలకు తగినట్టు తమను తాము మలచుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం యోచన. అందుకే వయోజన అక్షరాస్యత పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపర్చుతోంది. అదే సమయంలో పాఠశాల విద్యారంగంపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
100 శాతం అక్షరాస్యత.. వయోజన విద్యకు ప్రాధాన్యం
సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. 45 ఏళ్లు పైబడిన వయసులో అక్షరాస్యత తక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన వయోజనుల విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎక్కడికక్కడ వయోజన విద్యా తరగతులు నిర్వహించారు. దీంతో 2025-26 సంవత్సరంలో 6.31 లక్షల మంది పెద్దలు అక్షరాస్యత పరీక్షలకు హాజరయ్యారు. గత ప్రభుత్వం హయాంలో, ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు వయోజన విద్య పెంపు అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ఆ సమయంలో వయోజన విద్య పూర్తిగా కుంటుపడింది. అందుకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వయోజన విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగానే వయోజన విద్యలో పెద్ద ఎత్తున పెరుగుదల నమోదైంది.
పాఠశాలల్లో కొత్త మార్పులు
రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యలో నాణ్యత పెంచేందుకు ప్రజా ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. అకడమిక్‌ ప్యానెల్‌ ఇన్స్పెక్షన్‌ టీమ్స్‌ ద్వారా పాఠశాలల్లో బోధన విధానాలను ఉన్నతీకరించింది. ఇది విద్యార్థులకు అత్యాధునిక పద్ధతుల్లో అభ్యసనలో మెళకువలు నేర్పించేందుకు ఉపయోగపడింది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో 61 పాఠశాలల్లో ఈ విధానం అమలు చేసి, బోధనలో ఉన్న ఇబ్బందులు, అనుకూలతలను గుర్తించారు. చాలామంది ఉపాధ్యాయులకు మంచి పరిజ్ఞానం ఉన్నప్పటికీ, తరగతుల్లో విద్యార్థుల భాగస్వామ్యం తక్కువగా ఉండడాన్ని ఈ టీమ్స్‌ గుర్తించాయి. దానిని సరిదిద్ది సమర్థంగా అమలు చేయడంతో మంచి ఫలితాలు తీసుకురావడం సాధ్యమైందని విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఆరు నెలల్లోనే మంచి ఫలితాలు
రాష్ట్ర ప్రభుత్వ చర్యల ఫలితంగా తక్కువ సమయంలోనే పాఠశాల విద్యలో మంచి మార్పులు చోటుచేసుకున్నాయి. బోధన పద్ధతుల్లో వ్యూహాత్మకత 48 శాతం నుంచి 68 శాతానికి పెరిగింది. తరగతుల గదుల మెరుగైన నిర్వహణలో 42 శాతం నుంచి 65 శాతానికి, బోధనాభ్యసన సామగ్రి, వనరుల వినయోగం 35 శాతం నుంచి 58 శాతానికి పెరిగింది. ఇవన్నీ మంచి ఫలితాలు వచ్చేందుకు కారణమయ్యాయి.
ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి
పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ప్రాథమిక దశలోనే అక్షరాలు రాయడం, అంకెలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి 2025-26 వరకు మంచి ఫలితాలు వచ్చాయి. తెలుగులో 9 శాతం నుంచి 35 శాతం వరకు, ఇంగ్లీష్‌ లో 4 శాతం నుంచి 29 శాతం వరకు, ఉర్దూలో 19 శాతం నుంచి 40 శాతం వరకు అభ్యసన సామర్థ్యాలు పెరిగాయి. భాషతో పాటు అంకెలు నేర్చుకోవడం, కూడికలు, తీసివేతలు వంటి గణిత ప్రక్రియల్లోనూ 18 శాతం నుంచి 30 శాతం ఫలితాలు అధికంగా వచ్చాయి.
విద్యకు అత్యధిక నిధుల వినియోగం
సమగ్ర శిక్షా పథకం కింద వచ్చిన నిధులను వినియోగించడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2025-26లో 84 శాతం నిధులు వినియోగించుకుని తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ప్రతి రూపాయి విద్య కోసం, విద్యార్థుల కోసం వ్యయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యా రంగంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు తెలంగాణను దేశంలో ముందువరుసకి తీసుకెళుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు విద్యార్థులు, ఉపాధ్యాయులకు విద్యా వ్యవస్థ ప్రగతికి మరింత దోహదపడుతున్నాయి. విద్యా రంగంలో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా ముందుకు సాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -