– 1:4 నిష్పత్తిలో ప్రతిపాదనలు పంపండి : ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మూడేండ్ల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం మూలంగా అవి నిరుపయోగంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని రూ.148 కోట్లతో వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్బాబు పాల్గొన్నారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన రూ.148 కోట్ల నిధుల విడుదలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిందని భట్టి ప్రకటించారు. సరైన పద్ధతిలో ప్రతిపాదనలు పంపితే ఆమోదం తెలపడం, అమలు చేయడం సులభం అవుతుందనీ, పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. 1:4 నిష్పత్తిలో వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపితే ఉపసంఘం చర్చించి ఆమోదం తెలుపుతుందని వివరించారు. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని జూన్ ఎనిమిది లోపల అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఈ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రగతిని తాను ప్రత్యేకంగా ప్రతి వారం సమీక్షిస్తానని స్పష్టం చేశారు. టెండర్లు పిలవడం, పనులు చేపట్టడం, నాణ్యతతో పనులు పూర్తి చేయడం వంటి అన్ని అంశాలను తాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



