ప్రయివేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ
సామాజిక ఉద్యమకారుడు రాజశేఖర శర్మ డిమాండ్
నవతెలంగాణ-అచ్చంపేట
రాష్ట్రంలో, జిల్లా లో విచ్చలవిడిగా పెరిగిపోతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే “ఫీజుల నియంత్రణ చట్టం” తీసుకురావాలని సామాజిక ఉద్యమకారుడు వావిలాల రాజశేఖర్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యా వ్యాపారమే పరమావధిగా సాగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల ధనదాహానికి సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నాయని, విద్యా ప్రమాణాలను పెంచడం పక్కన పెట్టి, కేవలం లాభార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలను నడుపుతున్నారని ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల ప్రాంగణాల్లోనే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, టై ,బెల్ట్ ,మరియు యూనిఫామ్లను విక్రయిస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు దోపిడీకి తెరలేపుతున్నాయని పేర్కొన్నారు.
బయట మార్కెట్ కంటే రెట్టింపు ధరలకు ఈ వస్తువులను పాఠశాలల్లోనే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం అన్యాయం, కళ్ళ ముందే ఇంతటి దోపిడీ జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించడానికి తక్షణమే ఒక బలమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి స్కూల్ క్యాంపస్లలో పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తున్న విద్యాసంస్థలపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో ఫీజుల వివరాలను, నిబంధనలను పారదర్శకంగా బోర్డులపై ప్రదర్శించేలా విద్యాశాఖ అధికారులు చూడాలన్నారు.



