పాత్రికేయులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి

– జాతీయ జర్నలిస్టు సంఘాల డిమాండ్
– కోల్ కతాలో ముగిసిన ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు
నవతెలంగాణ – కరీంనగర్ 
దేశవ్యాప్తంగా పాత్రికేయులకు, పాత్రికేయేతర సిబ్బందికి మెరుగైన వేతనాల కోసం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పలు జాతీయ జర్నలిస్టు సంఘాలు  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. నూతన వేజ్ బోర్డులో ప్రింట్ మీడియా జర్నలిస్టుతో పాటు ఎలక్ట్రానిక్, వెబ్, సోషల్ మీడియా జర్నలిస్టులను చేర్చాలని డిమాండ్ చేశాయి. సోమవారం కోల్ కతాలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) రెండు రోజుల జాతీయ వర్కింగ్ కమిటీ  సమావేశాలు ముగింపు సందర్భంగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే), పీటీఐ ఎంప్లాయిస్ యూనియన్స్ ఫెడరేషన్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్ యూజే) తదితర సంఘాలతో కూడిన నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆర్గనైజేషన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు రెండు వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.1955 నాటి వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని సవరించి, ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్, వెబ్, సోషల్ మీడియాలను చట్టం పరిధిలోకి తీసుకురావాలని సమావేశం కోరింది. పార్ట్ టైం రిపోర్టర్లు, గ్రామీణ విలేకరులకు వేజ్ బోర్డు అమలు చేయాలని, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మీడియా సంస్థలు జర్నలిస్టులను చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయని ఆరోపిస్తూ, ఈ అక్రమ తొలగింపులను సమావేశం తీవ్రంగా ఖండించింది. అక్రమ తొలగింపు చర్యలపై న్యాయ పోరాటం చేయడానికి జాతీయస్థాయి లీగల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల అక్రమ తొలగింపు కేసులు, వేజ్ బోర్డు కేసులను లీగల్ కౌన్సిల్ కు అప్పగించాలని తీర్మానించారు. ప్రెస్ కౌన్సిల్ స్థానంలో జాతీయ స్థాయిలో మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, మీడియా కౌన్సిల్ కు అధికారాలను కల్పించి వివిధ జాతీయ స్థాయి జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు పెన్షన్ విధానం తీసుకురావాలని, వివిధ రాష్ట్రాలలో జర్నలిస్టు సంక్షమ నిధిని ఏర్పాటు చేయాలని సమావేశం కోరింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలలో జర్నలిస్టుల సమస్యలపై ఆయా రాష్ట్రాల ప్రతినిధులు నివేదికలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, గ్రామీణ జర్నలిస్టుల స్థితి గతులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు తదితర సమస్యలపై ఐఎఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు నివేదించారు. ఈ సమావేశంలో ఐఎఫ్ డబ్ల్యూజే సెక్రటరీ జనరల్ విపిన్ దులియా, ఎన్ యూజే అధ్యక్షుడు అశోక్ మాలిక్, సెక్రటరీ జనరల్ శర్మ పీటీఐ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఇందుకాంత్ దీక్షిత్, ప్రధాన కార్యదర్శి బలరాం సింగ్ దహియా, ఐఎఫ్ డబ్ల్యూజే ఉపాధ్యక్షులు విశ్వదేవ్ రావు, మోహన్ కుమార్, సంతోష్ చతుర్వేది, అతుల్ పాల్, విజయ్ పాల్(త్రిపుర), సంతోష్ మధుకర్(బీహార్) తదితరులు పాల్గొన్నారు. సమావేశాల అనంతరం జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కోల్ కతాలోని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) కార్యాలయాన్ని సందర్శించారు.
Spread the love