అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీను యాదవ్
నవతెలంగాణ-అచ్చంపేట
అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అధునాతన సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శీను యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నల్లమల అంటేనే క్రీడాకారులకు పుట్టినిల్లు అని, ఈ ప్రాంతం నుండి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అధునాతన స్టేడియం, మౌలిక వసతులు లేక నల్లమల క్రీడాకారులు వెనుకబడి పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధునాతన వసతులతో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు చేసి క్రీడాకారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. నాగర్ కర్నూల్ నూతన జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు అధికారులు, పాలకులు క్రీడాకారులకు కనీసం క్రీడా మైదానం ఏర్పాటు చేయలేదన్నారు. సింథటిక్ ట్రాక్ పై సాధన చేయడం కొరకు క్రీడాకారులు వేరే జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు తక్షణమే ఈ విషయంపై స్పందించి అధునాతన సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.



