నవతెలంగాణ హైదరాబాద్: నగరంలో చోటుచేసుకుంటున్న హత్యలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. శనివారం నగరంలో చోటు చేసుకున్న ఓ ఉద్దంతం ఆ కలవరపాటును మరింత పెంచుతుంది. ఓ యువతి దారుణహత్యకు గురైంది. ఆమె భర్త రెండో అంతస్తు నుంచి కిందపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ చంపాపేట్ రాజిరెడ్డినగర్లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేటకు చెందిన మోహన్, రూప దంపతుల కుమార్తె స్వప్న(20). ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన మోహన్ ఆటో నడుపుతున్నారు. ఎనిమిది నెలల క్రితం స్వప్న, హన్మంతు అనే యువకుడితో కలిసి చంపాపేటలోని రాజిరెడ్డినగర్లోని ఇంట్లో అద్దెకు దిగింది. నెలరోజుల క్రితం ఆమె ప్రేమ్కుమార్(25) అనే యువకుడిని ప్రేమించి పెండ్లి చేసుకుంది. అప్పటి నుంచి తరచూ బయటి వ్యక్తులు వచ్చిపోతుండడంతో.. ఇంటిని ఖాళీ చేయమని యజమాని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారుజామున స్వప్న ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త కూడా వచ్చాడు. అప్పటికే అక్కడ ఇద్దరు యువకులు ఉన్నట్టు సమాచారం. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ, స్వప్న దారుణంగా హత్యకు గురైంది. గొంతు తెగి రక్తపు మడుగులో పడిఉన్న సమయంలోనే ప్రేమ్కుమార్ రెండో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. పెద్దగా శబ్దం రావడంతో బయటకు వచ్చిన ఇంటి యజమానికి రక్తపుమడుగులో పడి ఉన్న ప్రేమ్కుమార్ కనిపించాడు. రెండో అంతస్తులోని గది నుంచి ఇద్దరు యువకులు కిందికి రావడాన్ని గమనించినట్టు యజమాని చెబుతున్నారు. గదిలోకి వెళ్లి చూడగా స్వప్న రక్తపు మడుగులో పడి ఉందని ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఆమె తండ్రి మోహన్ ఫిర్యాదుమేరకు ఐఎస్సదన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త అపస్మారకస్థితిలో ఉండడం, ఆ ఇద్దరు యువకులు పారిపోవటంతో గదిలో ఏం జరిగిందో తెలియడం లేదు. యువతి మొబైల్ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్డేటా సేకరిస్తున్నారు. యువకుడి ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రేమ వ్యవహారమే దారుణానికి కారణం కావచ్చని, ప్రేమ్కుమార్ది ఆత్మహత్యాయత్నంగా పోలీసులు అనుమానిస్తున్నారు.