జాత్యాహంకార హింస పట్ల ఐలూ ఖండన

– మణిపూర్‌ ఘటన పట్ల ఆందోళన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న హింసాకాండను తక్షణమే నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. అక్కడ జరుగుతున్న జాత్యాహంకార హింసను ఖండించింది. ఈ మేరకు శనివారం ఐలూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.సత్యనారాయణ, కె.పార్థసారథి, గౌరవ అధ్యక్షులు జి.విద్యాసాగర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మణిపూర్‌లోని పరిస్థితిని పరిశీలించి అక్కడి ఆస్తి నష్టంతో పాటు ప్రార్థనా స్థలాలను సందర్శించి సంఘీభావం తెలిపేందుకు వీలుగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అక్కడి రాష్ట్ర పోలీసులు, ఇతరులు చేసిన లైంగిక దాడులకు సంబంధించిన అన్ని కేసులను విచారించేలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. తక్షణ ఉపశమనం కలిగేలా, బాధితులు వారి ఇండ్లకు, గ్రామాలకు క్షేమంగా చేరేలా భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు

Spread the love