బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి

– మణిపూర్‌ ఘటనకు కేంద్ర బాధ్యత వహించాలి: సామాజిక, మహిళా, ప్రజా సంఘాల నిరసనలో నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ పాలిత మణిపూర్‌ రాష్ట్రంలో ఆదివాసి గిరిజన మహిళలను నగంగా ఊరేగించి, లైంగిక దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని సామాజిక, మహిళా, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వా), సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(వ్యకాస), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌), ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల నాయకులు మల్లు లక్ష్మి, పాలడుగు భాస్కర్‌, ఆర్‌ వెంకట్రాములు, టి స్కైలాబ్‌బాబు, అన్నిగంటి వెంకటేశ్‌ మాట్లాడుతూ గత మూడు నెల్లుగా మణిపూర్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టింది సంఫ్‌ుపరివార్‌ శక్తులేనని విమర్శించారు. బీజేపీ రాజకీయ క్రీడలో ఎంతో మంది అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నివారించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ఆదివాసి మహిళలను నగంగా ఊరేగించటం భారతీయ సంస్కృతిలో భాగమా? అని ప్రశ్నించారు. ఈ దుర్గటన పట్ల సభ్య సమాజం సిగ్గుతో తలదించుకున్నదని తెలిపారు. పాలకులు నిర్లక్ష్య వైఖరి విడనాడాలని హితవు పలికారు. సుంప్రీకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కానీ.. ప్రధాని మోడీ మౌనం వీడలేదని తెలిపారు. భారత మాతాకీ జై అంటూనే మహిళలను నగంగా ఊరేగించడం వీరి ద్వంద వైఖరికి నిదర్శనమని విమర్శించారు. బీజేపీి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు పెచ్చుమీరుతున్నాయన్నాయని గుర్తుచేశారు. బేటి బచావో బేటి పడావో అని మాట్లాడుతున్న మోడీ సర్కార్‌ మహిళలికిచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. పౌర సమాజమే..మతోన్మాద పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వీ రమ, ఐద్వా అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌,ఐద్వా నాయకురాలు మద్దెల వినోద, నాగలక్ష్మి, శశికళ, పద్మ, సీఐటీయూ నాయకులు వంగూరి రాములు, శ్రీకాంత్‌, కూరపాటి రమేష్‌, యాటల సోమన్న వ్యకాస మహిళా కన్వీనర్‌ బొప్పని పద్మ, డివైఎఫ్‌ఎస్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, నాయకులు జావీద్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర నాయకులు బాలవీరు, బి సుబ్బారావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు అశోక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love