ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి

– ఆక్సీలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి
– 12 డి పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి
– సెక్టార్లను మూడుసార్లు సందర్శించాలి
– కలెక్టర్ హరిచందన దాసరి 
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. బుధవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి ఏఆర్వోలు, పోలీసు అధికారులతో పార్లమెంటు ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్లు, ర్యాంపులు, విద్యుత్తు, ఫర్నిచర్ వంటి  కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఆక్సీలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని, ఎక్కడైనా పోలింగ్ కేంద్రం లొకేషన్ మార్చాల్సి వస్తే రెండు రోజుల్లో తెలియజేయాలని చెప్పారు. మరోసారి బిఎల్ఓ నియామకాలను సరిచూసుకోవాలని, ఎవరైనా బదిలీ అయి ఉంటే ఆ మార్పులు అన్నింటిని సరిచేసి నివేదిక సమర్పించాలన్నారు. హోం ఓటింగ్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ ఈ విడత 85 సంవత్సరాల కు పెంచినందున 12 డి  పై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు పై పోలీసు అధికారులతో చర్చించి రూపొందించాలని, అలాగే ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాలను గుర్తించాలని,  ఎన్నికలకు నియమించిన అన్ని  బృందాలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, పోలీసు సిబ్బందితో కలిపి శిక్షణ నిర్వహించాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ఎన్నికల  ప్రణాళిక రూపొందించాలని, ఎఫ్ ఎస్టి, ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, వివి టి, ఎం సి సి బృందాలను నియమించాలని,సెక్టోరల్ అధికారులను  ముందే గుర్తించి సిద్ధం చేసుకోవాలని, సెక్టార్ల అధికారులు వారికి కేటాయించిన సెక్టర్లను మూడుసార్లు సందర్శించాల్సి ఉంటుందని, పోలీసు అధికారులతో కలిసి సందర్శించాలని తెలిపారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ నామినేషన్లు ఇతర సమయాలలో బందోబస్తు ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాటించిన అన్ని నియమ నిబంధనలను పాటిస్తూ కొత్తగా ఎన్నికల సంఘం జారీ చేసే సూచనలను సైతం దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించాలని పోలీసు అధికారుల ను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఏఆర్వోలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love