– వాటిలో మన పర్యాటక స్థలాలే లేవు
– ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’లో బయటపడిన బండారం
– బీజేపీ నేతలు, ప్రముఖుల అత్యుత్సాహంతో పోయిన పరువు
న్యూఢిల్లీ : ఇటీవల ప్రధాని లక్షద్వీప్లో పర్యటించి, అక్కడి చిత్రాలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన తర్వాత ఆ దీవులకు విపరీతమైన ప్రచారం లభించింది. అనేక మంది లక్షదీవులను మాల్దీవులతో పోల్చడంతో వివాదం కూడా చెలరేగింది. మోడీ లక్షద్వీప్ పర్యటన అనంతరం ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రముఖులు లక్షదీవుల అందాలను తెగ మెచ్చుకుంటూ పలు చిత్రాలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. ఒక్కసారి లక్షదీవులకు వెళితే జన్మ ధన్యమైపోతుందంటూ ఊదరకొట్టడం మొదలు పెట్టారు. పనిలో పనిగా కొందరు అండమాన్ నికోబార్ దీవులు, పోర్ట్ బ్లెయిర్ చిత్రాలంటూ కొన్నింటిని షేర్ చేశారు. కానీ అవన్నీ మన దేశంలోని పర్యాటక స్థలాల చిత్రాలేనా అనే విషయంపై ‘ఆల్ట్ న్యూస్’ పోర్టల్ కూపీ లాగగా బండారం బయటపడింది.
షేర్ చేసింది వీరే
లక్షదీవుల ఫొటోలు అని చెబుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రెండు చిత్రాలను షేర్ చేసి, ఆ తర్వాత వాటిని తొలగించారు. నటుడు రణవీర్ సింగ్ కూడా ఓ ఫొటోను షేర్ చేసి, దేశంలో బీచ్ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలంటూ నెటిజన్లను కోరారు. అయితే ఆయన కూడా ఆ తర్వాత ఆ ఫొటోను తొలగించారు. బీజేపీ ఎంపీ రవి కిషన్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కొన్ని సందర్శక స్థలాల ఫొటో లను షేర్ చేశారు. తామూ తక్కు వ తినలేదన్నట్లు మిత వాది అరుణ్ పుడుర్, బీజేపీ నాయకుడు తాజీం దర్ బగ్గా కూడా అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్, పోర్ట్ బ్లెయిర్ బీచ్ చిత్రాలను పోస్ట్ చేశారు.
అవన్నీ విదేశీ చిత్రాలే
అయితే బీజేపీ నేతలు, ప్రముఖులు షేర్ చేసిన చిత్రాలు ఎక్కడివని ‘ఆల్ట్ న్యూస్’ పోర్టల్ ఆరా తీసింది. లక్షద్వీప్ చిత్రాలుగా కిరణ్ రిజిజు, అరుణ్ పుడుర్ చెబుతున్నవి అలామీ స్టాక్ వెబ్సైట్్లో ఉన్న ఫొటోలు. అవి ఫ్రాన్స్ పొలినేసియాలోని బోరా బోరా దీవుల నుండి తీసినవి. డ్రీమ్స్టైమ్ వెబ్సైట్లో కూడా ఈ ఫొటోలు ఉన్నాయి. అవి ఫ్రాన్స్ పొలినేసియా చిత్రాలంటూ కింద రాశారు కూడా. ఇక అరుణ్ పుడుర్ షేర్ చేసిన మరో ఫొటోను గూగుల్లో ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ విభాగంలో వెతకగా అది షట్టర్స్టాక్ వెబ్సైట్లోనూ, అనేక స్టాక్ వెబ్సైట్ల లోనూ దర్శనమి చ్చింది. వాస్తవానికి అది థాయిలాండ్లోని తోన్సారు బీచ్.
ఇక రణవీర్ సింగ్ షేర్ చేసిన ఫొటో విషయానికి వస్తే దానిని షట్టర్స్టాక్ వెబ్సైట్ నుండి అప్లోడ్ చేసినట్లు తేలింది. ఆ ఫొటో మాల్దీవులకు చెందినది. మరో చిత్రాన్ని రవి కిషన్, కిరణ్ రిజిజు, అరుణ్ పుడుర్ షేర్ చేశా రు. ఆ చిత్రం 2013 లో టాప్ డ్రీమర్ అనే మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఆ ఫొటో కూడా మాల్దీవులకు చెందినదిగా తెలిపారు.
ఈ ఫొటోనే 2012 మార్చి 21న మాల్దీవన్ అనే ఫేస్బుక్ పేజీలో కన్పించింది. అదే ప్రదేశంలో వేరే కోణం నుండి మరో చిత్రాన్ని 2012 ఏప్రిల్ 26న తీశారు. ఇది ఫ్లికర్ వెబ్సైట్లో కూడా కన్పించింది. 2011 నవంబర్ 14న ఈ చిత్రాన్ని తీశారని వెబ్సైట్ తెలిపింది.
వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేసిన చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లోని ట్రావెల్ పేజీలో అప్లోడ్ చేశారు. ఫ్రెంచ్ పాలినేసిస్లోని బోరా బోరాలో ఈ చిత్రాన్ని తీశారు. అరుణ్ పుడుర్ షేర్ చేసిన మరో చిత్రం అబోడ్ స్టాక్ వెబ్సైట్లోనిది. ఇది థాయిలాండ్లోని ఫుకెట్ ప్రాంతానికి చెందిన ఫొటో. అరుణ్ పుడుర్ షేర్ చేసిన ఇంకో చిత్రం పింటరెస్ట్ నుండి తీసుకున్నది. ఈ చిత్రం కూడా థాయిలాండ్లోనిదే. ఇది ఆ దేశంలోని కో ఫిఫి ప్రాంతానికి చెందిన ఫొటో అని గూగుల్ మ్యాప్ బయటపెట్టింది. బీజేపీ నాయకుడు తాజిందర్ బగ్గా ఓ ఫొటోను షేర్ చేశారు. దీనిని స్టాక్ ఇమేజ్ వెబ్సైట్ షట్టర్స్టాక్ నుండి అప్లోడ్ చేశారని తేలింది. ఇది కూడా థాయిలాండ్లోని కో లైప్ బీచ్ ఫొటోయే. అరుణ్ పుడుర్ షేర్ చేసిన మరో ఫొటో అలామీ వెబ్సైట్ నుండి తీసుకున్నది. దీనిని 2017 మే 23న ఓ కంట్రిబ్యూటర్ ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ ఫొటో ఇండోనేషియాలోని లెంబాన్గన్ దీవుల సమీపంలో హిందూ మహా సముద్రంలోనిదని తేలింది.
రాజకీయ లబ్ది కోసమే
ఈ విధంగా లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, పోర్ట్ బ్లెయిర్లో తీసినవంటూ బీజేపీ నేతలు, ప్రముఖులు షేర్ చేసిన ఫొటోలలో ఏ ఒక్కటీ మన దేశానికి సంబంధించినది కాదని తేలిపోయింది. మొత్తం పది ఫొటోలను వారు సామాజిక మాధ్యమాలలో షేర్ చేయగా అవన్నీ వేర్వేరు వెబ్సైట్ల నుంచి తీసుకున్నవేనని రూఢ అయింది. ఎన్నికలలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే రాజకీయ నాయకులు, మితవాదులు ఈ నాటకానికి తెర తీశారని, చివరికి మన దేశం పరువు తీశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.