నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రక్షణ రంగంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. శత్రుదేశాల నుంచి ఎదురయ్యే విభిన్న క్షిపణి ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టేలా సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన మల్టీలేయర్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (BMD) వ్యవస్థను, యాంటీ షిప్ వార్ఫేర్ సాంకేతికతను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ అద్భుత ప్రయోగాల విజయంతో దీర్ఘశ్రేణి, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల దాడులను గాల్లోనే అడ్డుకునే అరుదైన సామర్థ్యం భారత్కు లభించినట్లయింది. ఈ మైలురాయి ప్రయోగాల్లో భాగంగా డీఆర్డీవో ఇటీవల జూన్ 10, 11 తేదీల్లో వరుసగా మూడు ఫ్లైట్ టెస్ట్లను నిర్వహించింది. ఈ మూడు పరీక్షల్లోనూ ఇంటర్సెప్టర్ క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించి, మల్టీలేయర్ బీఎండీ వ్యవస్థ యొక్క తిరుగులేని సామర్థ్యాన్ని నిరూపించాయి. ఈ అద్భుత విజయంతో ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక బీఎండీ రక్షణ సామర్థ్యం కలిగిన అగ్రదేశాల సరసన భారత్ చేరిందని డీఆర్డీవో వెల్లడించింది. దీనితో పాటు, నౌకాదళ బలాన్ని మరింత పెంచేలా సరికొత్త ‘నావెల్ యాంటీ-షిప్ మిసైల్ మీడియం రేంజ్’ (NASM-MR) తొలి పరీక్షను కూడా శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. రక్షణ రంగంలో సాధించిన ఈ వ్యూహాత్మక మైలురాయిపై కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగానికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలను ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ లో షేర్ చేస్తూ.. దేశ కీర్తిని పెంచిన డీఆర్డీవో శాస్త్రవేత్తలను, నౌకాదళ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
రక్షణ రంగంలో డీఆర్డీఓ మరో మైలురాయి
- Advertisement -
- Advertisement -



