ప్రజల పొదుపులు, రుణాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాల చెల్లింపులతో ముడిపడిన బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేటీకరణ, కార్పొరేట్ ప్రయోజనాల వైపు మళ్లించే విధానాలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈ నెల 11న ఒక రోజు, 28, 30 తేదీల్లో రెండు రోజులు, అలాగే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రజల కోసం కొనసాగించాలా, కొద్దిమంది కార్పొరేట్ సంస్థల లాభాల కోసం నడపాలా? అనే మౌలిక ప్రశ్న ఈ పోరాటంలో ముందుకు వస్తోంది. అందుకే ఇది కేవలం ఉద్యోగుల సమస్య కాదు. ప్రభుత్వ రంగ బ్యాంకులను, ప్రజల ఆర్థిక ప్రయోజనాలను కాపాడే పోరాటం. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు 18 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7.57 లక్షల మంది ఉన్నారు. కోట్లాది ప్రజల పొదుపులు, రుణాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాల చెల్లింపులు, వ్యవసాయ, వ్యాపార, విద్యా రుణాలు బ్యాంకుల ద్వారానే నిర్వహించబడుతున్నాయి. అందువల్ల బ్యాంకులు కేవలం వ్యాపార సంస్థలు కాకుండా దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి.అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడానికి బదులు వాటి సంఖ్యను తగ్గించడం, విలీనం చేయడం, ప్రైవేటు మూలధనానికి అవకాశాలు పెంచడం వంటి విధానాలు అమలవుతున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుల విలీనంతో పెద్ద బ్యాంకులు ఏర్పడినా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయనే హామీ లేదు. శాఖల మూసివేత, గ్రామీణ ప్రాంతాల్లో సేవల తగ్గింపు, ఉద్యోగుల సంఖ్య తగ్గింపు, పని ఒత్తిడి పెరగడం వంటి పరిణామాల భారం చివరకు ప్రజలపైనే పడుతుంది. కొన్ని పెద్ద బ్యాంకుల చేతుల్లో ఆర్థిక శక్తి కేంద్రీకృతమైతే సామాజిక నియంత్రణ బలహీనపడే ప్రమాదం ఉంది. బ్యాంకులు లాభాలకే ప్రాధాన్యత ఇస్తే రైతు రుణాలు, చిన్న వ్యాపారాలు, విద్యా రుణాలు, స్వయం ఉపాధి రుణాలకు ప్రాధాన్యత తగ్గవచ్చు. ఉద్యోగుల సంఖ్య తగ్గి పని ఒత్తిడి పెరిగితే వినియోగదారుల సేవల నాణ్యత కూడా దెబ్బతింటుంది. బ్యాంకు ఉద్యోగుల పోరాటాన్ని కేవలం వేతన సమస్యగా చూడటం సరికాదు. పనితీరు ఆధారిత ఒత్తిడి పెంచడం, ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రైవేటు రంగ ప్రమాణాలను రుద్దడం, ఉద్యోగుల హక్కులను చర్చల ద్వారా పరిష్కరించే ద్వైపాక్షిక వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు.ఒక బ్యాంకు బలహీనంగా ఉంటే దాన్ని మరో బ్యాంకులో విలీనం చేయడం మాత్రమే పరిష్కారం కాదని ఉద్యోగులు అంటున్నారు. మూలధనం అందించడం, చెడ్డ రుణాలను పరిష్కరించడం, నిర్వహణ లోపాలను సరిదిద్దడం, ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలు అవసరం.
విలీనాల తర్వాత శాఖల క్రమబద్ధీకరణ, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, బదిలీలు, పని ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తవచ్చు. పెద్ద బ్యాంకులుగా మార్చిన తర్వాత ప్రభుత్వ వాటాను తగ్గిస్తే ప్రజల సొమ్ముతో నిర్మించబడిన బ్యాంకు ఆస్తులు ప్రైవేటు మూలధనానికి చేరే ప్రమాదం ఉందని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల జాతీయీకరణతో బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. వ్యవసాయ రుణాలు, చిన్న పరిశ్రమల రుణాలు, విద్యా రుణాలకు మద్దతు పెరిగింది. ఇప్పుడు ఆ ప్రజా లక్ష్యాన్ని వెనక్కి నెట్టి బ్యాంకులను లాభాలకే పరిమితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. పెద్ద కార్పొరేట్ రుణాల విషయంలోనూ ఆందోళనలు ఉన్నాయి. 2015–16 నుంచి 2023–24 వరకు సుమారు రూ.12.3 లక్షల కోట్ల రుణాలు మాఫీ కాగా, 2020–21 నుంచి 2023–24 మధ్య దాదాపు రూ.9.90 లక్షల కోట్లు మాఫీ అయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదున్నర సంవత్సరాల్లో రూ.6.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు పార్లమెంటుకు సమాచారం ఇచ్చారు. చెడ్డ రుణాల భారాన్ని చివరకు ప్రజల పన్నుల సొమ్ముతో భర్తీ చేయాల్సి వస్తే లాభాలు ప్రైవేటీకరించబడి, నష్టాలు సామాజీకరించబడే విధానం ఏర్పడుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల విలీన ప్రభావం ఉద్యోగులకే కాకుండా వినియోగదారులపైనా ఉంటుంది. శాఖలు తగ్గితే వృద్ధులు, గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడవచ్చు. సిబ్బంది కొరతతో సేవలు దెబ్బతినవచ్చు.
అందుకే ఈ సమ్మె వినియోగదారుల ప్రయోజనాల పోరాటం కూడా అని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం, శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానాలను పెంచడం వంటి విస్తృత విధానాలతో బ్యాంకింగ్ రంగ పరిణామాలను విడదీయలేమని వారు అంటున్నారు. ఇతర కార్మిక సంఘాల మద్దతుతో ఈ పోరాటాన్ని విస్తృత కార్మికవర్గ సమస్యగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడం కాదు. రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలకు రుణాలందాలి. ప్రజల పొదుపులు సురక్షితంగా ఉండాలి. ఉద్యోగులకు గౌరవప్రదమైన వేతనాలు, పని పరిస్థితులు ఉండాలి. అందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని, విలీనం పేరుతో ఉద్యోగాలను తగ్గించకుండా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటీకరణకు బదులు ప్రభుత్వ రంగ బ్యాంకులను విస్తరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సొమ్మును కార్పొరేట్ ప్రయోజనాలకు అప్పగించే విధానాలను తిప్పికొట్టి, బ్యాంకు ఉద్యోగుల ఐక్య పోరాటానికి ప్రజలు, కార్మికవర్గం అండగా నిలవాలని వారు కోరుతున్నారు.
ఎస్ఎస్ఆర్ఎ ప్రసాద్, 9490300867



