నవతెలంగాణ – ఆలేరు రూరల
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూర్య ఘర్ యోజన సోలార్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గృహ అవసరాల కోసం సోలార్ విద్యుత్ వినియోగం,పథకం ద్వారా లభించే సబ్సిడీలు,దరఖాస్తు విధానం,విద్యుత్ బిల్లుల తగ్గింపు వంటి అంశాలపై రైతులు,గ్రామస్తులకు వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సూర్య ఘర్ యోజన ద్వారా సాధారణ ప్రజలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తికి ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రజలు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సోలార్ వ్యవస్థల వినియోగంతో దీర్ఘకాలికంగా విద్యుత్ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో టీజీఆర్ ఇడిఓ రవి, ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్,ఎంపీవో అనురాధ,కొలనుపాక గ్రామ సర్పంచ్ బెదరబోయిన యకమ్మ,బైరాంనగర్ సర్పంచ్ వెంకటేశ్వర రాజు,వార్డు సభ్యులు,వీఓఏలు , గ్రామస్తులు పాల్గొన్నారు.



