ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లులు కట్టే వారికి బిగ్ అలర్ట్!..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక రిక్వెస్ట్ చేసింది. ఇకపై కరెంట్ బిల్లులు టీజీఎస్‌పీడీసీఎల్ వెబ్‌సైట్ లేదా టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ లలో మాత్రమే చెల్లించాలని తెలిపింది. ఈ సమాచారాన్ని టీజీఎస్‌పీడీసీఎల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశింది. ట్విట్టర్ లో ప్రియమైన వినియోగదారులారా, ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, సర్వీస్ ప్రొవైడర్లు అనగా PhonePe, Paytm, Amazon Pay, Google Pay,  బ్యాంకులు జూలై 01, 2024 నుంచి టీజీఎస్‌పీడీసీఎల్ కు సంబందించిన విద్యుత్ బిల్లులను అంగీకరించడం నిలిపివేశాయని తెలిపింది. అందువల్ల, వినియోగదారులందరూ దయచేసి టీజీఎస్‌పీడీసీఎల్ వెబ్‌సైట్ లేదా టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంట్ బిల్లు చెల్లింపులను చేయవలసిందిగా అభ్యర్థించబడింది అని రాసుకొచ్చింది. కాగా గతంలో ఈ విద్యుత్ బిల్లులు గ్రామాల్లోని కరెంట్ ఆఫీస్ కి వెళ్లి చెల్లించేవారు. తర్వాత ఈ-సేవ, మీ-సేవలు అందుబాటులోకి వచ్చాక.. ఆన్ లైన్ సెంటర్లకు వెళ్లి చెల్లించడం మొదలు పెట్టారు. టెక్నాలజీ మరింత పెరిగాక ఆన్ లైన్ సర్వీస్ ప్రొవైడర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు విద్యుత్ బిల్లులు సహా ఇతర బిల్లులు ఇంటి వద్ద నుంచే చెల్లించే సదుపాయం ఉంది. ఇటీవల సవరించిన ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆన్ లైన్ సర్వీస్ ప్రొవైడర్లు విద్యుత్ బిల్లులను అంగీకరించడం నిలిపివేశాయి. దీంతో ఇప్పటినుంచి విద్యుత్ బిల్లులు కేవలం విద్యుత్ శాఖ కు చెందిన యాప్ ల ద్వారా లేదా నేరుగా విద్యుత్ శాఖకు చెందిన ఆఫీస్ ల వద్ద మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

Spread the love