నవతెలగాణ బ్యూరో – హైదరాబాద్
బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవమనీ, అలాంటి బోనానికి బీఆర్ఎస్ వెలకట్టిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ సంస్కృతికి సంకేతమైన దానికి వెలకట్టడం ఆ పార్టీ నేతల అహంకారానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతిని విధ్వంసం చేయడం బీఆర్ఎస్ పతనానికి సంకేతమని పేర్కొన్నారు. బోనం ఎత్తితే రూ.400, డ్యాన్స్ చేస్తే బీర్ బాటిల్ ఇచ్చారంటూ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ట్యాగ్ చేశారు.
కల్వకుంట్ల కవిత స్పందించరెందుకు?-సునీతారావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి మహిళలను, బతుకమ్మను కించపరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించరెందుకు? అని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ గాంధీభవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ బోనాలు హారతులు ఇస్తే డబ్బులు ఇస్తామని దండోరాలు వేయిస్తూ బీఆర్ఎస్ నేతలు మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోరు అదుపులోకి పెట్టుకోవాలని హెచ్చరించారు. మర్రి జనార్థన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.