నవతెలంగాణ పుణె: ‘‘శబ్ద కాలుష్యాన్ని అదుపులో ఉంచడం ఎంతో ముఖ్యం. వీఐపీ వాహనాలపై ఉండే రెడ్ లైట్ సంస్కృతికి ముగింపు పలికే అవకాశం నాకు లభించింది. ఇప్పడు వీఐపీ వాహనాల్లో సైరన్ కూడా తొలగించాలనుకుంటున్నాం. ఇందుకోసం కొత్త విధివిధానాలను రూపొందిస్తున్నాం. సైరన్కు బదులుగా భారతీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్, శంఖం వంటి వాటి ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేసేందుకు నిబంధనలు సిద్ధం చేస్తున్నాం. శబ్ద కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశం’’ అని నితిన్ గడ్కరీ తెలిపారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్లతో కలిసి పుణె లోని చాందినీ చౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.