Saturday, July 25, 2026
E-PAPER
Homeజాతీయందిగొచ్చిన‌ కేంద్రం

దిగొచ్చిన‌ కేంద్రం

- Advertisement -

త‌ట‌స్థ వేదిక‌పై సీజేపీతో చ‌ర్చ‌ల‌కు అంగీకారం
కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో కాక్రోచ్‌ ప్రతినిధుల‌తో
కేంద్రం భేటీ రెండు డిమాండ్ల‌కు అంగీకారం
ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై స‌మ‌యం కోరిన మంత్రులు
కొన‌సాగుతున్న ఆందోళన
నేడు మ‌రోసారి చ‌ర్చ‌లు

నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రారంభించిన ఆందోళ‌న‌లు దేశవ్యా ప్తంగా వ్యాపించడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దేశ రాజ‌ధానిలోని జంతర్ మంతర్‌కు దాదాపు పదివేల మందికి పైగా తరలిరావ‌డంతో చ‌ర్చ‌ల‌కు దిగొచ్చింది. మూడు డిమాండ్‌లను సీజేపీ నేతలు ప్రస్తావించగా.. రెండింటికి కేంద్రం అంగీకారం తెలిపింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌కు ఒక రోజు సమయం కోరడంతో ఢిల్లీలో ఆందోళ‌న‌లు కొనసాగుతున్నాయి. సీజేపీ డిమాండ్ మేరకు శుక్రవారం ఒక తటస్థ వేదికపై చర్చలు జరిగాయి. కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంగ, సౌరవ్ దాస్‌లు పాల్గొన్నారు. దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన ఈ చర్చల్లో నీట్‌ సహా విద్యావ్యవస్థలోని పలు కీలక అంశాలపై చర్చించారు. డిమాం డ్లను సీజేపీ లిఖితపూర్వ కంగా ప్రభుత్వం ముందుంచింది. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. పేపర్ లీక్ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటుకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించాలని స్పష్టం చేశారు. అయితే ఇందులో బాధిత కుటుం బాలకు పరిహారం, ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ కు కేంద్ర మంత్రులు అంగీకారం తెలిపారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో నేడు కూడా చ‌ర్చ‌లు కొన‌సాగ‌నున్నాయి.

కేంద్ర మంత్రి రాజీనామాపై 
స‌మ‌యం కోరిన కేంద్రం : సీజేపీ ప్రతినిధులు
కేంద్రం మంత్రులతో చ‌ర్చ‌ల‌ అనంతరం సీజేపీ ప్రతినిధి సౌరభ్‌ దాస్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ముందు మూడు ప్రధాన డిమాండ్లు పెట్టామని తెలిపారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంపై కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సంబంధించి శ‌నివారం వరకు కేంద్రం గడువు కోరిందని సౌరభ్‌ దాస్ చెప్పారు. సీజేపీ నేత అశుతోష్ రంక మీడియాతో మాట్లాడుతూ.. ధర్మేంద్ర ప్రధాన్ ను ప్రభుత్వం త్వరగా విధుల నుంచి తొలగిస్తుందని అనుకుంటున్నామని తెలిపారు.

నేడు మరోసారి చర్చలు : జేపీ నడ్డా
చ‌ర్చ‌ల అనంత‌రం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయని.. సీజేపీ ప్రతినిధులు మూడు ముఖ్యమైన డిమాండ్లను ఉంచారని వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై శనివారం మరో మారు చర్చిస్తామని వెల్లడించారు.

విద్యార్థుల‌పై దాడి చేసి పోలీసుల‌పై 
చ‌ర్య‌ల‌పై సీజేపీ వెబ్‌సైట్‌
విద్యార్థులపై జులై 20న జరిగిన దాడుల్లో పాల్గొన్న పోలీసులను గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సీజేపీ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. ‘సంసద్ చలో’ మార్చ్ సందర్భంగా జూలై 20న జరిగిన అణచివేతలో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని గుర్తించేందుకు, నిరసనకారుల నుంచి ఫోటోలు, వీడియోలను సేకరించడానికి ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్టు సీజేపీ శుక్రవారం ప్రకటించింది. ఆ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించి, కోర్టును ఆశ్రయిస్తామని కూడా తెలిపింది. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ, పోలీసు చర్య సమయంలో పోలీసు సిబ్బంది విద్యార్థులపై దాడి చేశారని, మహిళా నిరసనకారులను వేధించారని ఆరోపించారు. “మేము ముందే ప్రకటించినట్లుగా, విద్యార్థులపై దాడి చేసి, వారిని గాయపరిచి, యువతులను లైంగికంగా వేధించిన ప్రతి అధికారిని హెచ్చరించడం జరిగింది. మేము మౌనంగా ఉండబోము. ప్రతీదీ గుర్తుంచుకుంటాం,” అని ఉద్ఘాటించారు. అణచివేతలో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయాలని ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. గుర్తించిన అధికారులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకపోతే, తమ పార్టీ కోర్టులను ఆశ్రయిస్తుందని దాస్ గారు అన్నారు. జంతర్ మంతర్ వద్ద అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనల సందర్భంగా తమ సిబ్బంది విపరీతమైన బలప్రయోగం చేశారని, పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిపారని వచ్చిన ఆరోపణలపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్‌) విచారణ ప్రారంభించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.

విద్యార్థుల‌కు జేఎన్‌యూ, డీయూ బెదిరింపులు
నిరసనలో పాల్గొనవద్దని జేఎన్‌యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు, ఉద్యోగులకు సూచించాయి. ఈ చట్టపరమైన చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలుగుతుందని, వృత్తిపరమైన అవకాశాలపై ప్రభావం పడుతుందని వెల్లడించింది. అదేవిధంగా వ్యక్తిగత భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అందుకే వాటికి దూరంగా ఉండాలని పేర్కొంది. దీన్ని ప్ర‌తిప‌క్ష నేత‌లు త‌ప్ప‌ప‌ట్టాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్ర‌జాస్వామ్య హ‌క్కుల‌ను అమ‌లు చేస్తున్న విద్యార్థుల‌ను ఎందుకు బెదిరిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ నిలిపివేతకు వ్యతిరేకంగా న్యాయ సేవల సంస్థ సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్, ఇండియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మ‌రోవైపు సిజెపిపై ఎన్ఐఎ విచారణ కోరుతూ దాఖలైన పిటిష‌న్‌ను విచారణకు స్వీకరించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నిరసనకారులపై హింసకు సంబంధించి దాఖ‌లైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈనెల 27న విచారించ‌నుంది. జాతీయ మీడియా ఈ నిరసనను కప్పిపుచ్చగా, అంతర్జాతీయ మీడియా దీనిని ప్రచురించింది. ఇదిలా ఉండగా, 2024 నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సంజీవ్ ముఖ్యాపై ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ తెలిపింది.

విజయవంతమైన ఉద్యమం: గీతాంజలి ఆంగ్మో
“ఈ ఉద్యమం యావత్ దేశాన్ని మేల్కొల్పింది కాబట్టి, ఇది మాకు చాలా విజయవంతమైన ఉద్యమంగా నిలిచింది. ఇది ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందనిఆశిస్తున్నాను” అని వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి జె. ఆంగ్మో అన్నారు.

ఆంక్షల నీడలో జంతర్ మంతర్
భారీగా తరలివస్తున్న యువత
విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌ను కేంద్రం అంగీకరించకపోవడంతో జంతర్ మంతర్‌కు వస్తున్న ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగింది. భగత్ సింగ్, మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, చేగువేరాల చిత్రాలతో మరింత మంది నిరసన ప్రదేశానికి వచ్చారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, మోడీలకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఇంటర్నెట్‌ను నిరోధించడం, ట్రాఫిక్‌ను నియంత్రించడంతో ఆందోళనను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు విఫలమయ్యాయి. నిరసనకారులకు ఆహారం అందకుండా నిరోధించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నిరసన ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేసే ఆన్‌లైన్ వేదికలపై ఆంక్షలు విధించారు. వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించినప్పటికీ, ప్రధాన్‌ రాజీనామాను డిమాండ్ చేస్తూ తమ నిరసనను కొనసాగిస్తామని నిరసనకారులు తెలిపారు. వాంగ్‌చుక్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు.దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన నిరసనలు వ్యాపించిన నేపథ్యంలో, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో శిక్షను కఠినతరం చేసే సవరణ బిల్లుకు శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ప్రశ్నపత్రాల లీకేజీని నివారించడానికి శుక్రవారం మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధానమంత్రి గురువారం రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు.
జులై 20న పార్లమెంటుకు జరిగిన మార్చ్ సందర్భంగా నిరాయుధ నిరసనకారులపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్‌) పెల్లెట్ గన్‌లను ఉపయోగించిందన్న మీడియా నివేదికలను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ధ్రు వీకరిస్తోంది” అని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. జాతీయ రాజధానిలో పౌరులపై భద్రతా దళాలు పెల్లెట్ గన్‌లను ఉపయోగించినట్లు స్ప‌ష్టం అయింది.మ‌రోవైపు ఆందోళ‌న‌ను అణచివేసేందుకు కూడా కేంద్రం కూడా చర్యలు తీసుకుంటోంది. మరో పది సిఆర్‌పిఎఫ్ కంపెనీలను ఢిల్లీకి రప్పించారు.
సుప్రీంకోర్టు అభ్యర్థించినప్పటికీ, అన్ని మెట్రో స్టేషన్లను తెరవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కేవ‌లం మండి హౌస్, సెంట్రల్ సెక్రెరియట్ మెట్రో స్టేషన్ల‌ను మాత్ర‌మే తెరిచారు. ఇంకా 15 మెట్రో స్టేష‌న్లు మూసివేత‌లో ఉన్నాయి. నిరసన ప్రదేశానికి చేరుకుంటున్న ప్రజలను హర్యానా సరిహద్దు వద్ద నిలిపివేశారు.

47 మంది అధికారులపై ఎన్టీఏ వేటు
పటిష్టమైన పరీక్షా సంస్కరణలను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా, జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్టీఏ) 47 మంది అధికారులను విధుల నుంచి తొలగించింది. వీరిలో కొంతమంది అధికా రులపై చట్టపరమైన, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -