– పంజాబ్పై ఏకపక్ష విజయం
– రాణించిన జడేజా, తుషార్, సింగ్
– చెన్నై 167/9, పంజాబ్ 139/9
చెన్నై సూపర్కింగ్స్ అదరహో. గత నాలుగు మ్యాచుల్లో మూడు పరాజయాలు చవిచూసిన సూపర్కింగ్స్ ధర్మశాలలో గెలుపు బాట పట్టింది. పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసి ఏకపక్ష విజయం సాధించింది. 168 పరుగుల ఊరించే ఛేదనలో జడేజా, తుషార్, సిమ్రన్జిత్ మ్యాజిక్తో పంజాబ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చెన్నై సూపర్కింగ్స్ ఏడో విజయం ఖాతాలో వేసుకోగా.. పంజాబ్ కింగ్స్ ఏడో ఓటమిని మూటగట్టుకుంది.
నవతెలంగాణ-ధర్మశాల
రవీంద్ర జడేజా (43, 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) (3/20) ఆల్రౌండ్ ప్రదర్శనతో మాయజాలం చేశాడు. జడేజా మ్యాజిక్తో పంజాబ్ కింగ్స్ చేతిలో వరుస ఐదు ఓటములకు చెన్నై సూపర్కింగ్స్ చెక్ పెట్టింది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసిన సూపర్కింగ్స్ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్-4లోకి ప్రవేశించింది. 168 పరుగుల ఛేదనలో పంజాబ్ కింగ్స్ చతికిల పడింది. ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ (30, 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), శశాంక్ సింగ్ (27, 20 బంతుల్లో 4 ఫోర్లు) మినహా టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. జానీ బెయిర్స్టో (7), రొసో (0), కరన్ (7), జితేశ్ (0), ఆషుతోశ్ (3) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు జడేజా (3/20), తుషార్ (2/35), సిమ్రన్జిత్ సింగ్ (2/16) మెరవటంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజాకు తోడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (32, 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), డార్లీ మిచెల్ (30, 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఎం.ఎస్ ధోని (0) గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ (3/24), రాహుల్ చాహర్ (3/23), అర్షదీప్ సింగ్ (2/42) రాణించారు.
జడేజా షో : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు వచ్చిన సూపర్కింగ్స్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. అజింక్య రహానె (9) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (32), డార్లీ మిచెల్ (30) రెండో వికెట్కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా క్రమం తప్పకుండా బౌండరీలు బాదారు. శివం దూబె (0), మోయిన్ అలీ (17) నిరాశపరచటంతో చెన్నై 101/5తో కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో రవీంద్ర జడేజా (43) ఆదుకున్నాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో మెరిశాడు. మిచెల్ శాంట్నర్ (11), శార్దుల్ ఠాకూర్ (17) తోడుగా డెత్ ఓవర్లలో రాణించాడు. ఎం.ఎస్ ధోని (0) తొలి బంతికే నిష్క్రమించగా అభిమానులు నిరాశకు లోనయ్యారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్లు సూపర్కింగ్స్ బ్యాటర్లను సమర్థవంతంగా నిలువరించారు. చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులే చేసింది.