నవతెలంగాణ – హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… చిన్న వయసులో తనకు క్రైస్తవ మతస్తులతో మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. విద్య, వైద్య రంగంలో క్రైస్తవులు ఎన్నో సేవలందిస్తున్నారని కితాబునిచ్చారు. పేదలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరికి న్యాయం ఉండాలనేది ఏసు క్రీస్తు ఆశయమని అన్నారు. దయ, కరుణ, సేవ అనే ఆదర్శాలతో జీవించాడని చెప్పారు. ఉన్నత విలువలు పాటిస్తూ వారసత్వ రక్షణపై మనందరం దృష్టి సారించాలని సూచించారు. సరస్పర సహకారం, సమన్వయంతో అందరం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.