నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ – నాగర్‌కర్నూల్‌
నాగర్‌కర్నూల్‌ సమీకృత కలెక్టరేట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో పూజ కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. చాంబర్‌లో కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌ యాదవ్‌తో పాటు జిల్లా అధికారులు, నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాలను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన తెలిసిందే. ఆయా జిల్లాలకు అన్నిహంగులతో సమీకృత కలెక్టరేట్లను నిర్మించేందుకు నిర్ణయించారు. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల శివారులోని కొల్లాపూర్‌ చౌరస్తాలో 12ఎకరాల సువిశాల స్థలంలో 1.25లక్షల చదరపు అడుగుల స్థలంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తుల్లో నిర్మాణమైంది. సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించారు. రూ.52కోట్లతో కలెక్టరేట్‌ నూతన భవనం నిర్మాణమైంది. ఇక్కడే 32శాఖల కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి.

Spread the love