కుప్పకూలిన కల్వర్టు.. ఐదుగురు దుర్మరణం

నవతెలంగాణ-భువనేశ్వర్‌: ఒడిశాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కల్వర్టు కుప్పకూలడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు, పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా కళ్యాణ్‌సింగ్‌పూర్‌ బ్లాకులోగల ఉపరసాజ గ్రామం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలవల్ల కల్వర్టు బేస్‌లో ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో కల్వర్టు కుప్పకూలి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనా ప్రాంతంలో శిథిలాల తొలగింపు కొనసాగుతున్నదని ఒడిశా న్యాయశాఖ మంత్రి జగన్నాథ్‌ సరాకా చెప్పారు.

Spread the love