కమ్యూనిస్టులను బలపరచాలి

కమ్యూనిస్టులను బలపరచాలి– ప్రజా సమస్యలపై నికరంగా పోరాడుతున్న సీపీఐ(ఎం) : పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు
నవతెలంగాణ-వైరాటౌన్‌
రాజకీయాలు వ్యాపారంగా మారిన ప్రస్తుత సమాజంలో చట్టసభల్లో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం చాలా ఉన్నదని, ప్రజల పక్షాన నికరంగా నిలబడి నిజాయితీగా పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని, ఓట్లు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు విజ్ఞప్తి చేశారు. వైరా నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చైతన్యంతో ఆలోచించి సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్య వీరభద్రంకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఆదివారం వైరా పట్టణంలోని మధు విద్యాలయం నందు ఆపార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పోతినేని మాట్లాడుతూ.. బీజేపీని ఓడించగలిగే పార్టీకి సీపీఐ(ఎం) మద్దతు ఇవ్వాలనే పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు మునుగోడు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌తో ఎన్నికల సర్దుబాటుకు ప్రయత్నించామని, కానీ కేసీఆర్‌ బీజేపీతో ఒప్పందం చేసుకోవడంతో తెగదెంపులు చేసుకున్నామని తెలిపారు.
తర్వాత కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి ఫోన్‌ చేసి ఎన్నికల్లో కలిసి పోదామని కోరడంతో సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నం చేశామని, కాని పార్టీ రాష్ట్ర కమిటీ అడిగిన స్థానాలు ఇవ్వకుండా కాంగ్రెస్‌ అవమానపరచిందని, చివరికి వారు ఇస్తానన్న మిర్యాలగూడ, వైరా నియోజకవర్గాలను కూడా ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. బీజేపీని ఓడించడమే సీపీఐ(ఎం) ప్రధాన లక్ష్యం అన్నారు. నవంబర్‌ 10న వైరా నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్య వీరభద్రం నామినేషన్‌ దాఖలు చేస్తారని, నామినేషన్‌ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. అనంతరం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని, ఎర్రజెండా గురించి అవాకులు, చవాకులు పేలుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.
సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గం అభ్యర్థి భూక్య వీరభద్రం మాట్లాడుతూ.. అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిథ్యం లేకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, దీనిని ప్రజలు అర్థం చేసుకొని సీపీఐ(ఎం)కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, సుంకర సుధాకర్‌, పారుపల్లి ఝాన్సీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మల్లెంపాటి వీరభద్రరావు, వైరా నియోజకవర్గం మండలాల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love