– అదనపు కలెక్టర్ మాధురి
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పత్తి కొనుగోళ్ళు సాఫీగా జరిగేలా సహకరించాలని అదనపు కలెక్టర్ మాధురి జిన్నింగ్ మిల్లుల యజమానులను కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోళ్లపై ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023-24 సం. వానాకాలం జిల్లాలో 3,58,690 ఎకరాలలో రైతులు పత్తి పంట వేసారని, సుమారు 2.51 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేయడం జరిగిందన్నారు. పత్తి నిల్వకు జిల్లాలో 37 గోడౌన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. బయోమెట్రిక్ డాటా బేస్ తోనే సిసిఐ కొనుగోలు చేస్తుందన్నారు. రైతు పట్టా పాస్ బుక్తో ఆదార్ లింక్ ఉండాలన్నారు. బాగా ఆరిన, తేమశాతం తక్కువగా ఉంటే ఎక్కువ ఎం ఎస్ పి లభిస్తుందని రైతులకు అవగాహన కల్పించాలని, జిన్నింగ్ మిల్లుల యజమానులకు వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. 8 శాతం లోపు తేమ గల పత్తికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.7,020/-గా లభిస్తుందని తెలిపారు. ఆయా అధికారులు తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఎక్యుప్మెంట్ను ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా రైతులకు తాగునీరు, టాయిలెట్స్, తదితర కనీస సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు కలుగకుండా సజావుగా కొనుగోళ్లకు సిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి మొహమ్మద్ రియాజ్, వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, ఆర్టిఏ, లీగల్ మెట్రాలజీ, అగ్నిమాపక,పోలీస్, సిసిఐ అధికారులు, మార్కెట్ కమిటీ సెక్రటరీలు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.