సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ..

నవతెలంగాణ-హైదరాబాద్ : అనంతపురం నగరం నడిబొడ్డున దాదాపు రూ.200 కోట్లు విలువగల మిస్సమ్మ కాంపౌండ్ (సీఎస్ఐ) స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. 7 ఎకరాల 67 సెంట్లు సీఎస్ఐ చర్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు 2007 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో ఆరోపించారు. బీఎన్ఆర్ సోదరులు ఆయా భూములలో నివాసం ఉంటున్న పేదలను, విద్యాసంస్థలను ఖాళీ చేయించేందుకు పలుమార్లు దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారని లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీఎన్ఆర్ సోదరులు సృష్టించిన దొంగ పత్రాలను రద్దు చేయాలని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు కోర్టులో కేసు వేయడం గమనార్హమని చెప్పారు. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఆయా భూములలో ఎలాంటి చట్ట విరుద్ధమైన అక్రమ కట్టడాలు జరగకుండా సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు, విద్యాసంస్థలకు రక్షణ కల్పించవలసిందిగా పోలీసు అధికారులను ఆదేశించాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

Spread the love