– ప్రతినిధులుగా జిల్లా, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు
– హాజరు కానున్న ముఖ్య అతిథులు రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు జాన్ వెస్లీ, మచ్చా వెంకటేశ్వర్లు
– వెల్లడించిన రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు జూన్ 3, 4, 5 తేదీలలో అశ్వారావుపేటలోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య తెలిపారు. మంగళవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన శిక్షణా తరగతుల వివరాలను వెల్లడించారు.
బుధవారం ఉదయం 10 గంటలకు పార్టీ పతాకావిష్కరణ అనంతరం తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ శిక్షణా తరగతులకు పార్టీ జిల్లా కమిటీ, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు ప్రతినిధులుగా హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే శిక్షణా తరగతుల్లో మొదటి రోజు “జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు – పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాలు” అనే అంశంపై రాష్ట్ర కమిటీ సభ్యులు పొతినేని సుదర్శన్రావు, “హిందూత్వ మతోన్మాదం – ప్రతిఘటనా పద్ధతులు” అనే అంశంపై రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ బోధిస్తారని తెలిపారు.
రెండో రోజు “సామ్రాజ్యవాదం – దోపిడీ పద్ధతులు” అనే అంశంపై రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్బాస్, “కమ్యూనిస్టు విలువలు – క మ్యూనిస్టు ఉద్యమ కార్యాచరణ “అనే అంశంపై సీనియర్ నాయకులు పి. సోమయ్య శిక్షణ ఇస్తారని చెప్పారు.
మూడో రోజు “పార్టీ నిర్మాణం – కేంద్ర కమిటీ నివేదిక” అనే అంశంపై రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, “పార్టీ కార్యాచరణ – వివిధ రంగాల బాధ్యుల కర్తవ్యాలు” అనే అంశంపై జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు వివరిస్తారని తెలిపారు. శిక్షణా తరగతులకు హాజరయ్యే ప్రతినిధులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి, అర్జున్, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు మడకం గోవిందు, మడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



