నొయిడాలోని కార్మికులను కలిసిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం
న్యూఢిల్లీ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం, హక్కుల సాదనకై పోరు బాట పట్టిన కార్మికులకు సీపీఐ(ఎం) అండగా నిలబడుతుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ హామీనిచ్చారు. నొయిడాలో కార్మికుల ఉద్యమంలో పాల్గొని, అరెస్టయి, దాదాపు నెల రోజులు జైల్లో గడిపిన తర్వాత బెయిల్పై విడుదలైన కార్మికులను సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. ఈ బాధిత కార్మికులను వారి ఉద్యోగాల నుండి కూడా తొలగించారు. పోలీసు కస్టడీలో వున్నపుడు కూడా తమపై భౌతిక దాడులు జరిగాయని వారు ప్రతినిధి బృందానికి తెలిపారు. తమపై కల్పిత సాక్ష్యాలను నమోదు చేశారన్నారు. తమ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో అనేక అభియోగాలు తమపై మోపారని వారు తెలిపారు. ఈ ప్రతినిధి బృందంలో పొలిట్బ్యూరో సభ్యులు ఆర్.అరుణ్ కుమార్, తపన్ సేన్, రాజ్యసభ ఎంపి వి.శివదాసన్, సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రాజీవ్ కున్వర్, పి.వి.అనియాన్, నొయిడా నేతలు రామ్ స్వారత్, గంగేశ్వర్, రామ్ సాగర్లు వున్నారు. ఏప్రిల్లో కార్మికులు పోరుబాట చేపట్టిన నేపథ్యంలో, ఫాబ్స్ట్రాక్ట్ క్లోతింగ్ దుస్తుల ఫ్యాక్టరీకి చెందిన 50మంది కార్మికులు కార్మికోద్యమంలో చేరారు.
వారు తమ ఇబ్బందులను ప్రతినిధి బృందానికి తెలియచేశారు. ఆటోమొబైల్ రంగానికి చెందిన కంపెనీ వైబ్రాకౌస్టిక్ ఇండియాకు చెందిన కార్మిక ప్రతినిధులను కూడా ప్రతినిధి బృందం కలిసింది. దుస్తుల ఫ్యాక్టరీ, మదర్సన్లకు చెందిన కార్మికులు ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోనివ్వకుండా, సంఘటితం కావాలనే వారి హక్కును తరచుగా యాజమాన్యాలు అడ్డుకుంటాయని చెప్పారు. ఎవరైతే నాయకత్వ పాత్ర పోషిస్తూ వుంటారో వారిని తరచుగా ఉద్యోగాల నుండి తొలగిస్తూ వుంటారని వారు తెలిపారు.
ఇలా అణచివేత చర్యలు, అరెస్టులు, డిస్మస్లు ఇవన్నీ కూడా కార్మికుల హక్కులపై కొనసాగుతున్న దాడులేనని స్పష్టమవుతోంది. అయినా కూడా పోరాటం కొనసాగుతుంది. ఈ దాడులకు కార్మికుల ఐక్యత, వారు సంఘటితం కావడం, సమిష్టి ప్రతిఘటన అనేవి బలమైన ప్రతిస్పందనగా నిలుస్తాయి. కార్మికులతో సమావేశానంతరం సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ మాట్లాడుతూ, కార్మికులపై పోలీసు హింసకు దిగినందుకు, వారిపై తప్పడు కేసులు నమోదు చేసినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. జైళ్ళలో అన్యాయంగా వున్న కార్మికులను చూసేందుకు అధికారులు అనుమతి నిరాకరించడాన్ని కూడా ఆయన ఖండించారు. ఆ కార్మికుల్లో కొందరు కనీసం బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేకపోయారని, వారికి సక్రమంగా న్యాయ సహాయం కూడా అందలేదన్నారు. ఇది, వారి ప్రాధమిక హక్కులను తిరస్కరించడమేనని ఆయన విమర్శించారు. గత కొద్ది రోజులుగా, జైల్లో వున్న కార్మికులను కలుసుకోవడానికి తమ ఎంపి డాక్టర్ వి.శివదాసన్ ద్వారా అనుమతి పొందేందుకు ప్రయత్నించామని చెప్పారు.
పోరుబాటలోని కార్మికులకు సీపీఐ(ఎం) సంఘీభావం
- Advertisement -
- Advertisement -



