– జగిత్యాల జిల్లా కలెక్టర్కు బాధితుల ఫిర్యాదు
నవతెలంగాణ -మెట్పల్లి
ఓ దళిత కుటుంబాన్ని గ్రామ పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామారావుపల్లెలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలు బద్ది నర్మద మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ భర్త, కొందరు గ్రామస్తులు తన కుటుంబంపై వ్యక్తిగతంగా, రాజకీయ కక్షతో గ్రామ బహిష్కరణ విధించారని తెలిపింది. గ్రామ పెద్దలైన పులి వెంకటి, ఒళ్లెం గంగారెడ్డి, పుప్పాల ప్రతాప్, ఒళ్లెం మల్లయ్య, ఇంద్రాల రాజనర్సయ్య, అవుదుర్తి చిన్న నర్సయ్య, కొండ శ్రీనివాస్, పొన్నం రాజేందర్ మొదలైన గ్రామపెద్ద మనుషులతో కలిసి కక్ష కట్టి తమ కుటుంబంతో ఎవరైనా మాట్లాడితే రూ.10వేలు జరిమానా విధిస్తామని, కుటుంబానికి ఏవిధమైన సహాయ సహకారాలు అందించకూడదని తీర్మానించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన కుటుంబాన్ని మనోవేదనకు గురిచేస్తున్న సర్పంచ్ భర్త, గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు తెలిపింది.