‘యశోద’లో విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి

Successfully in 'Yashoda'
Lung transplant– విషం తాగిన వ్యక్తికి దేశంలోనే మొదటి సారి..
నవ తెలంగాణ-బేగంపేట్‌
దేశ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ వైద్య చరిత్రలోనే సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్స్‌ వైద్యులు చరిత్ర సృష్టించారు. విషం తాగిన ఓ వ్యక్తికి ఒకేసారి రెండు ఊపిరితిత్తుల మార్పిడి (కంబైన్డ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) సర్జరీని విజయవంతంగా నిర్వహించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. దేశంలో విషం తాగిన వ్యక్తికి విజయవంతంగా సంయుక్త ఊపిరితిత్తుల మార్పిడి చేసిన మెట్టమొదటి కేసు ఇదే. ఈ సందర్బంగా యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ పవన్‌ గోరుకంటి వివరాలను శుక్రవారం వెల్లడించారు. మహబూబా బాద్‌ జిల్లా, ముర్రాయిగూడెంకు చెందిన 23 ఏండ్ల రోహిత్‌ వ్యక్తిగత కారణాలతో కలుపు, గడ్డి నియంత్రణకు ఉపయోగించే ”పారాక్వాట్‌” అనే పురుగు మందు తాగాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న అతన్ని సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. విష రసాయనం సేవించడం వల్ల రోహిత్‌ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయానికి భారీ నష్టం జరిగింది. పారాక్వాట్‌ విషకణాలు చురుకుగా ఊపిరితిత్తులను చేరడంతో కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసిస్‌ ఏర్పడింది. శ్వాసకోశ వైఫల్యం పారాక్వాట్‌ మత్తు చివరి దశలో మరణానికి దారితీస్తుంది. తీవ్ర ప్రాణాపాయంలో ఉన్న అతనికి ”డబుల్‌ లంగ్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌” ద్వారా సరికొత్త జీవితాన్ని యశోద ఆస్పత్రి వైద్యులు అందించారు. ప్రపంచంలోనే అరుదైన ఈ 4వ విజయవంతమైన సర్జరీతో భారత వైద్యరంగం-ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ రంగంలో చరిత్ర సృష్టించిందని, ఇది మన తెలుగు రాష్టాలకు ఎంతో గర్వకారణం అని తెలిపారు.
సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్‌, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్‌. హరికిషన్‌ గోనుగుంట్ల మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి సందర్భాల్లో అవయవ మార్పిడికి ముందు శరీరంలో మిగిలి ఉన్న విష అవశేషం మొత్తాన్ని తెలుసుకోవడానికి పరీక్ష లభ్యతలో పరిమితి ఉన్నందున ఈ కేసు అనేక విధాలుగా ప్రత్యేకమైందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ”జీవన్‌ దాన్‌” సంస్థ అవయవ దానం చొరవలో భాగంగా బ్రెయిన్‌ డెడ్‌ అయిన రోగి (దాత) నుంచి సేకరించిన ఊపిరితిత్తులను, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మోనాలజిస్ట్‌ డాక్టర్‌ హరి కిషన్‌ గోనుగుంట్లతో పాటు థొరాసిక్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌. కె. ఆర్‌. బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్‌. మంజునాథ్‌ బాలే, డాక్టర్‌. చేతన్‌, డాక్టర్‌. శ్రీచరణ్‌, డాక్టర్‌. విమి వర్గీస్‌తో కూడిన వైద్య బృందం ఆరు గంటల ఆపరేషన్‌ తరువాత రోహిత్‌కు విజయవంతంగా ”లంగ్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌” సర్జరీ చేసినట్టు తెలిపారు. శస్త్రచికిత్స పూర్తయ్యే సరికే ఊపిరితిత్తులు పనిచేయటం ప్రారంభించినప్పటికీ మరో 24 గంటల పాటు వెంటిలేటర్‌ సాయం అందించి, తరువాత కోలుకుంటున్న స్థితిలో రెండు వారాల పాటు ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆపైన ఆస్పత్రిలోని గదికి మార్చామని చెప్పారు. యశోద హాస్పిటల్స్‌లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందం 24 గంటల పర్యవేక్షణతో చాలా తక్కువ సమయంలో అద్భుతమైన రికవరీ సాధించి రోహిత్‌ను హాస్పిటల్‌ నుంచి విజయవంతంగా డిశ్చార్జ్‌ చేయగలిగామని చెప్పారు.

Spread the love