నవతెలంగాణ-విలేకరులు
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, బంగారం లభ్యమవుతోంది. శుక్రవారం హైదరాబాద్లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 9.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ చింతల కుంటలో 4 చోట్ల, సాగర్ రింగ్ రోడ్డులో చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ. 28,99,640 నగదును పోలీసులు సీజ్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల్లో ఓ కారులో రూ. 12 లక్షలు విలువ చేసే 20 తులాల బంగారం, 9 వేలు విలువచేసే పన్నెండున్నర తులాల వెండి ఆభరణాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీసీ పోలీసు స్టేషన్ పరిధిలోనిó అన్నోజిగూడ వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ ద్విచక్రవాహనంలో రూ. 5 లక్షలు, ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి శివారెడ్డిగూడ వద్ద ద్విచక్రవాహనంలో రూ. 3 లక్షలు పట్టుబడ్డాయి. జవహర్ నగర్ కార్పొరేషన్ చెన్నాపురం చౌరస్తా తనిఖీల్లో రూ. 6 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా అదే సమయంలో ఆటుగా వెళుతున్న నాగారం ఎక్స్రోడ్డు సమీపంలో డి.కొత్తపల్లి ఆవాసం బీమ్లాతండాకు చెందిన ఇద్దరు మహిళల తమ హ్యాండ్ బ్యాగ్లను బ్యాగ్లను తనిఖీ చేయగా వారి వద్ద నుంచి రూ.9.90లక్షల నగదును సీజ్ చేసి ఎలక్షన్ సూపరింటెండెంట్ మద్దెల ముత్తయ్యకు అప్పగించారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.కోటిన్నరకుపైగా నగదును పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి మండలంలో వాహనాల తనిఖీల్లో ఎరుకల వెంకటేష్ అనే వ్యక్తి నుంచి రూ.90 వేలు సీజ్ చేశారు.