నవతెలంగాణ – అమరావతి: ఏపీలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్ల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 28 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం కాల్లెటర్లను ఆగస్టు 14 నుంచి తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు గానూ ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించగా.. 1,51,288 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో 57,923 మంది అర్హత సాధించగా.. వీరిలో 56,116మంది స్టేజ్-2 ఆన్లైన్ ఫాంను సమర్పించారు. వీరిలో 47,926మంది పురుషులు ఉండగా.. 8190 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.